రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ బ్రిడ్జిపై శనివారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని మోదేపల్లి గ్రామానికి చెందిన భీమని హనుమంతరావు (55) పని మీద అద్దంకి వచ్చాడు. తిరిగి తిమ్మాయపాలెం గ్రామానికి నడిచి వెళ్లాడు. అక్కడి నుంచి ఆటో ఎక్కడం కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో గుండ్లకమ్మ బ్రిడ్జిపైకి రాగా అద్దంకి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా మృతిచెందాడు. మృతునికి, భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొమరోలు: పరీక్షలు దగ్గరకొస్తున్నాయి చదువుపై శ్రద్ధ పెట్టమని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్మీడియెట్ విద్యార్థి శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని యర్రపల్లెకు చెందిన మల్లెబోయిన వెంకటేశ్వర్లు, రాములు దంపతుల రెండో కుమారుడు మల్లెబోయిన వెంకటసాయి (18) కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వెంకటసాయి చదువుపై శ్రద్ధ పెట్టకపోవడంతో తండ్రి వెంకటేశ్వర్లు చదువుకోవాలని మందలించాడు. పరీక్షలంటే భయపడిన వెంకటసాయి మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లోని సీలింగ్ కొక్కేనికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పొదిలి: స్థానిక పిచ్చిరెడ్డితోటలోని గురజాల నరేష్కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం దగ్ధమైంది. చుట్టుపక్కల వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. రేకులు వేసుకునేందుకు తెచ్చిపెట్టుకున్న రూ.20 వేల నగదుతో పాటు టీవీ, మోటారు సైకిల్, వంట సామగ్రి, దుస్తులు కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలు మాత్రమే మిగిలాయని తెలిపారు.
సింగరాయకొండ: మండల పరిధిలోని పాకల సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ఫెస్టివల్ సందర్భంగా హెలికాప్టర్ రైడింగ్, స్పీడ్ బోట్ రైడింగ్ ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ప్రారంభించారు. సాయంత్రం సాగరతీరాన వేదపండితుల ఆధ్వర్యంలో సాగరహారతి నిర్వహించారు. ప్రముఖ టీవీ యాంకర్ సుమ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్దన్రాజు, జేసీ కల్పనాకుమారి, ఇతర అధికారులు పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఫెస్టివల్ సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయలేదని పర్యాటకులు ఆసహనం వ్యక్తం చేశారు. ప్రచారం చేసిన స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంపై నిరాశ చెందారు. ఆర్టీసీ బస్సులు కూడా రెండు మూడు బస్సులు మాత్రమే ఏర్పాటు చేయడంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


