పచ్చాకు ట్రాక్టర్ బోల్తా
● ఇద్దరు మహిళా కూలీలు మృతి
లింగసముద్రం: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబాలను పోషించుకుంటుంటారు. ఎప్పటిలానే శనివారం కూడా పచ్చాకు కొట్టేందుకు వెళ్లారు. ఆకు రెలిపి ట్రాక్టర్లో నింపారు. ట్రాక్టర్లో ఆకుపైనే కూర్చుని ఇంటికి వస్తున్నారు. కానీ, అంతలోనే జరిగిన ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్లిపోయారు. లింగసముద్రం మండలంలోని గంగపాలెం సమీపంలో శనివారం మధ్యా హ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీ లు మృత్యువాత పడ్డారు. స్థానిక ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గంగపాలెం గ్రామానికి చెందిన గొర్రెపాటి చెంచురామయ్య పొగాకు బ్యారన్కు పొగాకు రెలిపేందుకు చెంచురామయ్య ట్రాక్టర్, ఏజర్ల ఏడుకొండలుకు చెందిన ట్రాక్టర్లలో స్థానిక ఎస్సీకాలనీకి చెందిన కూలీలు వెళ్లారు. పొలంలో పొగాకు రెలుపుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. చెంచురామయ్య ట్రాక్టర్ కొంతమంది కూలీలతో ముందు వెళ్తుండగా, ఏడుకొండలు ట్రాక్టర్ ఆరుగురు కూలీలతో వెనుక వెళ్తోంది. రోడ్డుపై ఉన్న గుంతను ఎక్కిదిగే క్రమంలో పచ్చాకుతో ఉన్న ఏడుకొండలు ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా చింతకాయ ఊడిపోయి తిరగబడింది. దీంతో దానిపై కూర్చుని ఉన్న ఆరుగురు కూలీల్లో ఇద్దరు అందులో నుంచి దూకివేశారు. మరో ఇద్దరు పక్కకు పడిపోయారు. మిగిలిన ఇద్దరైన స్వర్ణ సలోమి (35), పట్టపు రత్తమ్మ (40) పచ్చాకు కింద పడిపోయారు. ట్రాలీని జేసీబీ సహాయంతో పైకిలేపి పచ్చాకు తొలగించి చూడగా, అప్పటికే ఊపిరాడక వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో గంగపాలెం గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్డం నిమిత్తం కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పచ్చాకు ట్రాక్టర్ బోల్తా


