పురుగుమందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కంభం: పురుగుమందు తాగి కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన కొమరోలు నాగరాజు(48) పొలాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం మద్యం తాగి రాత్రి పురుగుమందు తాగాడు. విషయం తెలుసుకున్న బంధువులు గిద్దలూరులోని ప్రైవేట్ వైద్యశాలకుతరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు వైద్యశాలలో మృత దేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
సింగరాయకొండ: ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ దగ్ధమైంది. ఈ సంఘటన మంగళవారం మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్–8 వ లైనులో సయ్యద్ మొబిన్ ఇంటివద్ద జరిగింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. మొబిన్ లారీలకు బాడీ మెకానిక్గా పనిచేస్తుంటాడు. ఉదయం మెకానిక్ షెడ్డుకు వెళ్లేందుకు మోటారుసైకిల్ ఇంటి బయట పెట్టి ఇంటి గేటు వేసే క్రమంలో హఠాత్తుగా ఆయిల్ ట్యాంకు కింద నుంచి మంటలు చెలరేగి ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచాయి. ఈ సమయంలో ట్యాంకులో పెట్రోల్ నిండుగా ఉంది. ఈ ప్రమాదంలో బండి పూర్తిగా తగలబడింది. ప్రమాద స్థలాన్ని ఎస్సై బి. మహేంద్ర పరిశీలించారు.
మార్కాపురం: పదో తరగతి విద్యార్థుల 100 రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని 144 ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలు, సీఆర్ఎంటీలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను గమనించి వారి అభివృద్ధికి, చదువు పట్ల ఆసక్తి పెంచడానికి ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అన్నీ పాఠశాలల హెచ్ఎంలు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకూ అంశాల వారీగా రెమిడీయల్ సెషన్స్ ఎసెస్మెంట్ నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేసి విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని సూచించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన హెచ్ఎంలను అభినందించారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ఎం శ్రీనివాసులు, మార్కాపురం, ఒంగోలు ఎంఈఓలు రాందాస్నాయక్, కిశోర్, హెచ్ఎంలు చంద్రశేఖర్రెడ్డి, శ్రీదేవీ పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: చిన్నారుల్లో మానసిక, శారీరక రుగ్మతలను ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ భగీరథి సూచించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని బాల భవిత కేంద్రంలో ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్పై జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భగీరథి మాట్లాడుతూ పీడీయాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ తిరుపతిరెడ్డి, జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతం, డాక్టర్ నాగార్జునరెడ్డి, డీఈఐసీ మేనేజర్ స్టెఫీగ్రాఫ్, స్టేట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ప్రతినిధి డాక్టర్ వినయ్ శిక్షణ ఇచ్చారు. చిన్నవయసులోనే వచ్చే వ్యాధులు, మానసిక రుగ్మతలు, ఎదుగుదలలో లోపాల గురించి వివరించారు. చిన్న వయసులో వచ్చే వ్యాధులను ఎంత త్వరగా పసిగడితే అంత తొందరగా చికిత్స చేయవచ్చని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. సునీత, జయలక్ష్మి, కరవది అనిల్, విద్య, రాజా, రాము తదితరులు పాల్గొన్నారు.
పురుగుమందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పురుగుమందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పురుగుమందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


