
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు సిటీ: ఉచిత విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం కోటా కింద పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఏ కిరణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి మే నెల 15వ తేదీలోగా ఆన్లైన్లో హెచ్టీటీపీ://ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగుల కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఎవరికై నా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004258599ను సంప్రదించవచ్చన్నారు. అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు, పిల్లల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. సీబీఎస్ఈ, ఐబీ, ఐసీఎస్ఈ బడుల్లో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి పిల్లలకు ఐదేళ్లు పూర్తయి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ పాఠశాలల్లో జూన్ 1 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా మే 16 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారన్నారు. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24వ తేదీ మధ్య విడుదల చేస్తారని తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణను విడతల వారీగా జూన్ 2, 6, 12 తేదీల్లో విడుదల చేస్తారని చెప్పారు.
విలువలతో కూడిన విద్యతోనే
ఉన్నత శిఖరాలు
● మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి రాజ్యలక్ష్మి
ఒంగోలు సిటీ: చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ వలన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఒంగోలులోని బాలసదన్ను ఆమె సందర్శించారు. అక్కడి విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన సదుపాయాలను పరిశీలించారు. బాలసదన్కు సంబంధించిన దస్త్రాలు, కార్యాలయ నిర్వహణ తీరును పరిశీలించారు. మరింత మెరుగైన సదుపాయాల కోసం సూచనలు చేశారు. చట్టపరంగా విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తోందని తెలిపారు. తదనంతరం శిశుగృహను న్యాయమూర్తి సందర్శించి అక్కడి నవజాత శిశువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.హేమలత, జూనియర్ సివిల్ న్యాయమూర్తి కే నికిత, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దినేష్కుమార్, తదితరులు పాల్గొన్నారు.