
ఎవరి ఎజెండా వారిది!
నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించే నగరపాలక సంస్థ స్థాయీ సంఘం (స్టాండింగ్ కమిటీ) ఎన్నికలు అధికార కూటమిలో కాకరేపుతున్నాయి. ప్రస్తుతం కూటమి పార్టీలకు కౌన్సిల్లో పూర్తి మెజార్టీ ఉంది. స్థాయీ సంఘం కాలపరిమితి పూర్తయి ఏడాది కావొస్తున్నా కొత్త కమిటీ కొలువు దీరకపోవటానికి అధికార కూటమిలో లుకలుకలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారింది. జనసేన, బీజేపీలకు సైతం అవకాశం ఇవ్వాల్సి వస్తుందన్న కుట్రతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదన్న ప్రచారం కార్పొరేషన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
జనసేన సభ్యులకు ఇవ్వటం ఇష్టం లేకనే...
స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే కౌన్సిల్లో బలమున్న జనసేన సభ్యులకు ఇవ్వలేకనే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదుగురిలో కనీసం జనసేన సభ్యులకు ఇద్దరికై నా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అది ఇష్టంలేకనే ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్కు అడ్డుతగులుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేని కాదని కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చే సాహసం చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి సభ్యులు రెండు పార్టీలు కలుపుకుంటే మేయర్తో కలిపి 46 మంది అయ్యారు. వారిలో టీడీపీకి చెందిన వారు 25 మంది కాగా జనసేనకు చెందిన వారు 21 మంది ఉన్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్సార్సీపీని వీడి జనసేనలోకి వెళ్లగానే 20 మంది కార్పొరేటర్లు ఆయన వెంటే జనసేనలోకి వెళ్లారు. ఎన్నికలు పెడితే ఐదుగురూ కూటమి సభ్యులే గెలుస్తారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మరిచిపోయారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే కార్పొరేషన్లో స్థాయీ సంఘానిదే కీలక భూమిక. నగరాభివృద్ధి కంటే రాజకీయాలే కూటమి నాయకులకు ముఖ్యమైనట్టున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీలకు ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్లో పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. అయితే స్థాయీ సంఘం ఎన్నికలంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రస్తుతం కూటమి పార్టీల్లో భాగస్వాములుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వీరి ఇద్దరి మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్థాయీ సంఘం వేస్తే 21 సభ్యులున్న జనసేనకు స్థానం కల్పించాల్సి వస్తుంది. అందుకే ఈ కమిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఇష్టపడడంలేదని తెలుస్తోంది. నగరపాలక సంస్థలోని కార్పొరేటర్లలో ఐదుగుర్ని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. ఇందుకు సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇంత వరకూ అలాంటిదేమి జరగలేదు.
ఇప్పటి వరకు మూడు కమిటీలు:
ఒంగోలు నగర పాలక సంస్థ ఏర్పడిన నాటి నుంచి మూడు స్టాండింగ్ కమిటీలు పనిచేశాయి. అవి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పనిచేశాయి. ఒక్కో స్టాండింగ్ కమిటీ ఏడాది పాటు ఉంటుంది. నగర పాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 10 మందికి ఒకరు చొప్పున స్టాండింగ్ కమిటీ సభ్యుడ్ని ఎన్నుకుంటారు. అంటే ఐదుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 50 మంది కార్పొరేటర్లలో 43 మంది వైఎస్సార్సీపీ వాళ్లే. మిగతా సభ్యుల్లో ఆరుగురు టీడీపీకి చెందిన వారు, ఒక్కరు జనసేనకు పక్షాన ఉన్నారు. ప్రభుత్వం మారగానే పరిస్థితి మారిపోయింది.
ఇక స్టాండింగ్ కమిటీ లేనట్లే....
నగర పాలక సంస్థకు ఇక స్టాండింగ్ కమిటీలు లేనట్టేనని తెలుస్తోంది. ఎందుకంటే 2026 మార్చి 18వ తేదీతో పాలక మండలి కాల పరిమితి ముగుస్తుంది. స్టాండింగ్ కమిటీ 2024 జూన్ మాసంతో కాల పరిమితి పూర్తయింది. స్టాండింగ్ కమిటీ కాల పరిమితి ఏడాది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తే ఆగస్టు నాటికి కాలపరిమితి పూర్తయ్యేది. తరువాత రెండో కమిటీకి అవకాశం ఉండేది. అలాంటిది ఆగర్భ శతృవు బాలినేని శ్రీనివాస రెడ్డితో పొసగలేక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్టాండింగ్ కమిటీ వేయటానికి సుముఖత చూపటం లేదు. బాలినేని జనసేన పార్టీలో చేరినా ఇప్పటి వరకు వీళ్లిద్దరూ ఒకే వేదికను పంచుకున్నది కూడా లేదు. కూటమి పార్టీల్లో విభేదాలు నగరాభివృద్ధికి అవరోధంగా మారాయనడంలో సందేహం లేదు.
ఒంగోలు కార్పొరేషన్లో కూటమి పార్టీల మధ్య వర్గ పోరు స్టాండింగ్ కమిటీ కాల పరిమితి పూర్తయి ఏడాది ఇప్పటికీ వెలువడని నోటిఫికేషన్ జనసేన సభ్యులు కూడా ఎక్కువగా ఉండటంతో ముందుకు రాని ఒంగోలు ఎమ్మెల్యే ప్రస్తుతం కౌన్సిల్లో టీడీపీ 25, జనసేన 21, వైసీపీకి 4 కార్పొరేటర్లు నగరంలో కుంటుపడుతున్న అభివృద్ధి
నగరాభివృద్ధిలో కీలకపాత్ర
నగరాభివృద్ధిలో స్థాయీ సంఘం పాత్ర కీలకం. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నెలలో 4 సార్లు కమిటీ సమావేశం కావచ్చు. మేయర్, కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్టాంగింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనాలి. నగరం అభివృద్ధికి సంబంధించి ఆ సమావేశాల్లో చర్చ జరుగుతుంది. రూ.40 లక్షల వరకు ఈ కమిటీ ఆమోద ముద్ర వేయవచ్చు. రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు స్టాండింగ్ కమిటీకి పవర్ ఉంది. రూ.10 లక్షల లోపు అయితే కమిషనర్ అనుమతి సరిపోతుంది. కౌన్సిల్ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది. స్టాండింగ్ కమిటీకి అలాంటి నిబంధనలు ఏమీ లేవు. స్టాండింగ్ కమిటీ లేకపోవటంతో మేయర్ ద్వారా ముందస్తు అనుమతులు తీసుకుని అభివృద్ధి పనులను చేపట్టి తరువాత వాటిని కౌన్సిల్ ఆమోదింప చేసుకుంటున్నారు. దాంతో వర్కుల్లో వచ్చే పర్సెంటేజీలు పాలక మండలి ప్రధాన నేతతో పాటు అధికారులకు పంట పండుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా ఎక్సెస్లే కాబట్టి నియోజకవర్గ ముఖ్య నేతను ప్రసన్నం చేసుకుని జేబులు నింపుకుంటున్నారు.

ఎవరి ఎజెండా వారిది!