మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది వైఎస్ జగనే..
● ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ షంషేర్ ఆలీబేగ్
మార్కాపురం: ముస్లిం మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్ పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారన్నారు. గురువారం మార్కాపురంలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లును రాష్ట్రంలోని టీడీపీ జనసేన పార్టీలు సమర్థించగా, వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందన్నారు. గతంలో కూడా మైనార్టీల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ చేయూతనిచ్చిందన్నారు. ముస్లింల స్ధితిగతులు మార్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ ముస్లింలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు నడిపారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించగా, వైఎస్సార్ సీపీ మాత్రం గౌరవించిందన్నారు. ముస్లిం సమాజం వైఎస్ జగన్కు రుణపడి ఉంటుందని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి వైఎస్ జగన్ అత్యధికంగా నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో షాదీఖానాల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి సైతం నిధులు కేటాయించారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకుని, ముస్లింల మనోభావాలను గౌరవించాలని షంషేర్ ఆలీబేగ్ కోరారు.


