పది నెలల్లో జిల్లాకు ఏం చేశారో చెప్పండి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా కనిగిరిలో సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన సభకు హాజరైన మంత్రి లోకేష్, ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. గడిచిన 10 నెలలుగా ప్రకాశం జిల్లాకి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. శ్ఙ్రీమార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించిన తర్వాతే జిల్లాలో అడుగుపెడతామన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతామన్నారు. దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. వెలిగొండ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కూడా కేటాయించలేదు. ఇటీవలే జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టును కూడా సందర్శించడానికి ధైర్యం చేయలేక వెళ్లిపోయారు. ఇద్దరు మంత్రులుండీ వెలిగొండ ప్రాజెక్టు లైనింగ్ పనులు చేపట్టలేదు. జిల్లాకు ఏమీ చేయలేకపోయారు. లోకేష్ మాటలు వింటుంటే ఆయనకు జిల్లాపై కనీస అవగాహన లేదని స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మంచి చేస్తామని చెప్పే మంత్రులను చూశాం కానీ, మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించే మంత్రిగా లోకేష్నే చూస్తున్నాం. లోకేష్ రెడ్బుక్ కి ఎవరూ భయపడేది లేదు. ఇటీవల స్థానిక సంస్థలకు నిర్వహించిన ఉప ఎన్నికలతో ఆ విషయం లోకేష్కి అర్థమయ్యే ఉంటుంది.
వైఎస్సార్ సీపీ హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పరుగులు:
‘‘ప్రకాశం జిల్లాకు వైఎస్సార్ సీపీ ఏం చేసిందని లోకేష్ ప్రశ్నిస్తున్నాడు.. మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించింది. పాల శీతలీకరణ కోసం 161 సెంటర్లు ఏర్పాటు చేశాం. 591 సచివాలయాలు, 593 ఆర్బీకే సెంటర్లు, దాదాపు 1992 బడులను నాడు–నేడు కింద ఆధునికీకరించాం. 228 డిజిటల్ లైబ్రరీలు, 492 హెల్త్ సెంటర్లు, రెండు అగ్రి ల్యాబ్లు వైఎస్సార్ సీపీ హయాంలోనే ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా కేటాయించగా, ఒక్క వెలిగొండ ప్రాజెక్టు కోసమే ఏకంగా రూ.10 వేల కోట్లు కేటాయించారు. రామాయపట్నం పోర్టును వైఎస్సార్ సీపీ హయాంలోనే మొదలుపెట్టి దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందంటే అదీ వైఎస్సార్ సీపీ హయాంలోనే. మర్డర్లు, మానభంగాలు చేసిన వారంతా టీడీపీలో ఉంచుకుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజుకు 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని వారే ఒప్పుకున్నారు. ఆధారాలు లేకుండా అవాకులు చవాకలు పేలడం మానుకోవాలి. వెనుకబడిన ప్రకాశం జిల్లా మీద ప్రభుత్వం కరుణ చూపించాలి. ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా మెలగాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలి. కేవలం పది నెలల పాలనతోనే కూటమి ప్రభుత్వం దారుణమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. వ్యవసాయం భారమైంది. గ్రామాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. టీడీపీ నాయకులను తొందర్లోనే వెంటబడి తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయి. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశాడో చర్చకు సిద్ధమా?’’ అని తాటిపర్తి ప్రశ్నించారు.
ఏం చేశారో చెప్పుకోలేకనే రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు వెలిగొండ ప్రాజెక్టులో తట్ట మట్టినైనా తీశారా? ఇద్దరు మంత్రులుండీ ఉమ్మడి జిల్లాకు చేసింది శూన్యం జిల్లాపై మంత్రి లోకేష్కి కనీస అవగాహన లేదు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం


