రాష్ట్రవాప్తంగా వైఎస్సార్‌సీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు | Ysrcp To Hold Round Table Meetings Across Ap | Sakshi
Sakshi News home page

రాష్ట్రవాప్తంగా వైఎస్సార్‌సీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

Jun 5 2025 7:13 PM | Updated on Jun 5 2025 8:17 PM

Ysrcp To Hold Round Table Meetings Across Ap

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిద్దాం’’ అని సజ్జల పిలుపునిచ్చారు.

‘‘ఈ సమావేశాల్లో కీలక రంగాలకు సంబంధించి గతంలో వైఎస్‌ జగన్‌ పాలన, ఈ ఏడాదిలో ఏ విధంగా నాశనం చేశారనేది, ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది చెప్పాలి. వ్యవస్థలు నాశనం చేయడం, ఏ విధంగా అరాచకం చేస్తున్నారనేది, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో చర్చ జరగాలి. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోయిందనేది చెప్పగలగాలి. రెడ్‌బుక్‌ పాలన పేరుతో చేస్తున్న అరాచకాలు ఇలా అన్నీ బయటికి రావాలి’’ అని సజ్జల చెప్పారు.

ఉమ్మడి 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 13 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్‌ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, సోషల్‌ వర్కర్‌లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్థులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వేంపల్లి సతీష్‌ రెడ్డి, పూడి శ్రీహరి, గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను విజయవంతం చేద్దామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement