
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్ప 2 సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘రప్పా.. రప్పా’ డైలాగ్ కొట్టారు. కూటమి అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తాజా రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని ఆ డైలాగ్ పోస్టర్ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు.
ఆ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పోస్టర్లో వైఎస్ జగన్ ఫొటో కూడా ఉండటంతో అది కాస్తా ట్రెండ్లోకి వచ్చింది. ఈ పోస్టర్ వివాదాస్పదంగా మారడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం ప్రెస్మీట్లో విలేకర్లు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.

గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం.. అని వైఎస్ జగన్ తొలుత డైలాగ్ చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని జగన్ ప్రశ్నించారు.
అయితే 2029లో వైఎస్సార్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుంతాం ఒక్కొక్కడిని అని ప్లకార్డ్ ప్రదర్శించిన వ్యక్తి పక్కా టీడీపీ మనిషి అని తేలింది. గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైఎస్ జగన్.. చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని వైఎస్ జగన్ ప్రెస్మీట్ను ముగించారు.

