సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనతోనే ఈ ఎపిసోడ్కు ఎండ్కార్డ్ వేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని సమాచారం. విస్తరణలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పు.. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాముందని చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. శాఖల మార్పు సంకేతాలతో తమ శాఖలో పూర్తయిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసేందుకు మంత్రులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, వరంగల్లో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతుంది, వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో అనధికార పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కొండ సురేఖ.. నో పొలిటికల్ కామెంట్స్ అంటూ ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే రీతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు. అయితే, ఒక వైపు
ఏం జరుగుతుందోన్న ఆందోళనలో వరంగల్ ఈస్ట్ కొండా క్యాడర్ ఉంటే.. మరో వర్గం సంబరాలు చేసుకుంటున్నారు.
రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న కొండా మురళి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ కనిపించని సుస్మిత పటేల్ హడావుడి లేకుండా సైలెన్స్ మూడ్లోకి వెళ్లిపోయారు. మరో వైపు, మాజీ ఓఎస్డీ సుమంత్ జాడ కోసం వరంగల్లో కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని రాష్ట్రవాప్తంగా ఆసక్తి నెలకొంది.


