సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చామని.. మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘‘48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు, వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది. నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్రావు తమ్ముడు మహేశ్ రావు.. ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.
కాగా, సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్బాబు అన్నారు.
అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది.


