గ్రామ సచివాలయానికి టీడీపీ రంగులు

TDP colors for village secretariat in Andhra Pradesh - Sakshi

ప్రకాశం జిల్లా గమళ్లపాలెంలో టీడీపీ నేతల దుశ్చర్య 

కొత్తపట్నం: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలో టీడీపీ నాయకులు దుశ్చర్యకు తెగబడ్డారు. అక్కడి గ్రామ సచివాలయానికి టీడీపీ రంగు పసుపు వేశారు. అంతటితో ఆగక దాన్ని టీడీపీ కార్యాలయంగా తీర్చిదిద్దారు. అక్కడే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. మంగళవారం రాత్రి పది గంటల దాకా అక్కడే ఉండి సంబరాలు చేసుకున్నారు.

కొత్తపట్నం మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 13 చోట్ల వైఎస్సార్‌సీపీ, ఒక చోట సీపీఐ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందగా.. గమళ్లపాలెంలో టీడీపీ మద్దతుదారు బలగాని రమణమ్మ గెలుపొందారు. దీంతో టీడీపీ నేతలు దుశ్చర్యకు ఒడిగట్టారు. సచివాలయం ముందు జాతీయ జెండా ఎగురవేయడానికి ఏర్పాటు చేసిన 3 రంగుల ఇనుప రాడ్డుకు కూడా పసుపు రంగు వేసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు.

సచివాలయం ముందు భారీ ఫ్లెక్సీలు కూడా కట్టారు. వివిధ పనుల కోసం సచివాలయానికి వచ్చే వారికి ఫ్లెక్సీలు ఇబ్బందిగా ఉంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, గ్రామ సచివాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top