సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో తమ పార్టీలో అపోహలు రావొచ్చని.. అందుకే ఈ వివరణ అన్న సజ్జల.. కోటరీలో వైఎస్ జగన్ బందీ అయితే తక్కువ సమయంలోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. ఇవాళ (ఆదివారం) మీడియాతో మాట్లాడిన సజ్జల.. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
‘‘పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత వైఎస్ జగన్ ఒక్కరే. పేదల జీవితాల్లో వైఎస్ జగన్ మార్పు తీసుకొచ్చారు. పార్టీని వీడిన వారిపై మేము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదు. విజయసాయిరెడ్డి సొంత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లారు. వైఎస్ జగన్పై దాడి చేసేందుకు కొత్త పాత్రలు తెరపైకి వస్తుంటూనే ఉంటారు. అలానే ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే పాత్ర తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్పై సాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టి తన మీద పడాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ అన్ని మతాలపట్ల సమాన గౌరవం చూపిస్తారు’’ అని సజ్జల పేర్కొన్నారు.
వైఎస్ జగన్పై విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా విష ప్రచారం చేస్తున్నారు. పార్టీలో వైఎస్ జగన్ ఒక్కరే నాయకుడు.. మేమంతా కార్యకర్తలం. వైఎస్ జగన్పై ఎవరైనా విమర్శలు చేస్తే ఎల్లో మీడియా పండగ చేసుకుంటుంది. వైఎస్ జగన్.. విజయసాయిరెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చారు. విజయసాయిరెడ్డిని ఆయన ఉన్నత స్థానంలో కూర్చొబెట్టారు’’ అని సజ్జల వివరించారు.
‘‘గతంలో వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి అన్నారు. రాజీనామా సమయంలో ఎవరితోనూ సమస్యలు లేవని చెప్పారు. ఎంపీగా, జాతీయ కార్యదర్శిగా ఇలా ఎన్నో పదవులు పార్టీ ఇచ్చింది. వైఎస్సార్సీపీలో విజయసాయిరెడ్డికి వచ్చినన్ని పదవులు ఎవరికి రాలేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ


