ప్రొద్దుటూరు: తమ నాయకుడు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని పదే పదే హననం చేయడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి. గత కొన్నేళ్లుగా షర్మిల, సునీతలు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకే యత్నిస్తున్నారని రాచమల్లు ధ్వజమెత్తారు.
ఈ రోజు(శుక్రవారం, మార్చి 20 వ తేదీ) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి మీడియాతో మాట్లాడిన రాచమల్లు.. షర్మిలను ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా కుమారుడు వైఎస్ జగన్పై నిందలు వేయడం సరైనదేనా? అని విజయమ్మను ప్రశ్నించారు.
ఇంకా ఆయనేమన్నారంటే.. ‘ విజయమ్మ విడుదల చేసిన లేఖ టీడీపీ సోషల్ మీడియాలో మొదట వస్తోంది. దీన్ని బట్టే అర్థం అవుతోంది.. దీని వెనుక ఎవరున్నారో .. ఎక్కడ తయారవుతున్నాయో?, షర్మిల ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా కుమారుడు జగన్పై నిందలు వేయడం సరైనదా?, షర్మిల కోసం వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు యత్నిస్తున్నారు. షర్మిల, సునీత ఇంటి గుట్టును వీధికెక్కించారు. ఆస్తుల పంపకం అంటే పంచివ్వడం కాదా?, మీరు చెబుతున్నారు కదా.. షర్మిలకు ఇచ్చినట్లే వైఎస్ జగన్కు ఇచ్చారని.. మరి ఇది ఆస్తుల పంపకం కాదా?, చెల్లెలి మీద ప్రేమతో ఇవ్వాల్సినదానికంటే ఎక్కువే వైఎస్ జగన్ ఇచ్చారు.
2019 ఆగస్టులో వైఎస్ జగన్ ఓ ఎంఓయూ రాశారు. ఎంఓయూలో పెట్టింది చెల్లికి ప్రేమతో వైఎస్ జగన్ ఇవ్వాలనుకున్నది. 2024 వచ్చేసరికి తనతో విభేదించడంతో వైఎస్ జగన్ ఎంఓయూ రద్దు చేసుకున్నారు. వైఎస్ జగన్ తన సొంత డబ్బును చెల్లి షర్మిలకు రూ. 236 కోట్లు ఇచ్చారు. మంచి మనసు ఉంది కాబట్టే షర్మిలకు సొంత డబ్బును ఇచ్చారు జగన్.
చంద్రబాబు తన ఆస్తిలో వాటాను ఆయన సోదరీమణులకు ఇచ్చాడా?, ఆస్తుల పంపకం జరగకపోతే జగన్ ఆస్తులనే ఎందుకు అటాచ్ చేశారు?, ఆస్తుల పంపకం జరిగింది కాబట్టే షర్మిల ఆస్తులను అటాచ్ చేయలేదు’ అని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ సహనంతో భరించారు
ఎన్ని విమర్శలు చేసినా వైఎస్ జగన్ సహనంతో భరించారు. అందరూ కలిసి వైఎస్ జగన్పై పగబట్టారు. వైఎస్ జగన్కు మీరంతా ఇంతా అన్యాయం చేస్తారా?, మన శత్రువులతో చేతులు కలపడం కంటే అన్యాయం మరొకటి ఉంటుందా?, వైఎస్ జగన్ తరఫున ఆయన భక్తుడిగా ఇకపై ప్రశ్నిస్తూనే ఉంటా.
కనురెప్ప మూసి తెరిచేలోపల వైఎస్ జగన్ కోసం నా ప్రాణం ఇస్తా. నీ కొడుకును జైల్లో పెట్టిన పార్టీలోకి షర్మిల వెళ్తుంటే మీరెందుకు నిరోధించలేదు?, కొడుకును ఓడించమని ఏ తల్లైనా కోరుతుందా?, సరస్వతీ ప్లాంట్విషయంలో షేర్లు బదిలీ చేస్తే.. జగన్ జైలుకు పోతాడని తెలిసి కూడా బదలాయిస్తారా?, ఇది జగన్కు అన్యాయం చేయడం కాదా?, షర్మిల ప్రవర్తన వల్లే ఆమెకు చేసిన ఎంఓయూ రద్దు చేసుకున్నారు. మీరు బెయిల్ రద్దుకు దిగారు.. ఆయన ఎంఓయూ రద్దు చేసుకున్నారు’ అని స్పష్టం చేశారు రాచమల్లు.


