నేను భావోద్వేగానికి లోనయ్యాను: ప్రధాని మోదీ | Prime Minister Narendra Modi Addressing the NDA leaders meeting | Sakshi
Sakshi News home page

నేను భావోద్వేగానికి లోనయ్యాను: ప్రధాని మోదీ

Jun 10 2026 8:10 PM | Updated on Jun 10 2026 8:55 PM

Prime Minister Narendra Modi Addressing the NDA leaders meeting

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిపారు.

ఇందులో మోదీ మాట్లాడుతూ... ‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. నా జీవితంలో ఇదో అద్భుతమైన క్షణం. ఈ రోజు ఈ ప్రయాణంలో భాగమైన సహచరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

ఈ సందర్భంగా ఎన్‌డీఏ కుటుంబ సభ్యులు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది మీ ఆప్యాయతను, ఉదారతను ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని నేను వ్యక్తిగత విజయంగా చూడను. ప్రతి విధంగానూ ఇది మనందరి విజయం, ఎన్‌డీఏలోని ప్రతి భాగస్వామ్య పార్టీ సాధించిన ఉమ్మడి విజయం. 

అందువల్ల ఈ తీర్మానాన్ని మీ అందరికీ, మన ఎన్‌డీఏ కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నాను. భారతమాతకు ఇంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం లభించడం, ఆమెకు సేవ చేసే భాగ్యం దక్కడం దేవుని ప్రత్యేక కృప వల్లే సాధ్యం. నా దృష్టిలో ప్రజలే దైవ స్వరూపం. అందుకే ఈ సేవను నేను ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశాను. ఈ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ ఒంటరిది కాదు. ఇది ఒక సామూహిక యజ్ఞం. 

ఇందులో మీరందరూ, ఇంకా ఎంతోమంది సహచరులు కర్తవ్య భావనతో తమ సేవలు అందించారు. మీ అందరూ ఈ రోజును నాకు నిజంగా చిరస్మరణీయంగా మార్చారు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 'చరైవేతి, చరైవేతి' అనే మంత్రాన్ని జపిస్తూ, ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ వచ్చిన నేను, ఈ మైలురాయిని ఒక రోజు చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం దక్కడం నా అత్యున్నత భాగ్యంగా భావిస్తున్నాను" అని తెలిపారు. చరైవేతి, చరైవేతి అంటే నిరంతరం ముందుకు సాగాలని చెప్పే ప్రాచీన సంస్కృత మంత్రం.

దేశ అవసరాలే మా విధానాలకు పునాది 
ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. "2014లో భారతదేశానికి అవసరమైన మొబైల్ ఫోన్లలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వచ్చేవి. ఈ రోజు భారతదేశం దేశీయంగా 330 మిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్‌సెట్లను తయారు చేస్తోంది. 2014లో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2.5 గిగావాట్లు మాత్రమే ఉండేది. ఈ రోజు అది 150 గిగావాట్లను దాటింది. 2014లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండేది. ఈ రోజు అది 20%కు చేరుకుంది. 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ యూనిట్ కూడా లేదు. ఈ రోజు నిర్మాణంలో ఉన్న 10కుపైగా సెమీకండక్టర్ యూనిట్లు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపిస్తున్నాయి.

దేశ అవసరాలనే మా విధానాలకు, నిర్ణయాలకు పునాదిగా చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కొత్త ఆలోచనా విధానాన్ని స్వీకరించాం. యువత కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను సృష్టించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం. గిరిజన సమాజాల కోసం 'జనమన్' వంటి పథకాలను ప్రారంభించాం. ఇంతకుముందు పశుపోషకులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనం అందేది కాదు. ఆ సౌకర్యాన్ని వారికి కూడా విస్తరించాం. అంతేకాకుండా, వీధి వ్యాపారులకు మా ప్రభుత్వం 'స్వనిధి' రుణ కార్డు సౌకర్యాన్ని అందించింది..." అని మోదీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement