
ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' ఈ రోజు (మంగళవారం) తెలంగాణలోని సంగారెడ్డిలో రూ.7200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రగతికి తన నిబద్ధతను వివరించారు. రాష్ట్రాల అభివృద్దే దేశాభివృద్ధి అనే స్పూర్తితో తాను పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణను 'గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా' అని పిలవవచ్చని ఈ సందర్భంగా మోదీ అన్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, గత పదేళ్లుగా తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
ఈ రోజు 140 కోట్ల భారతీయులు అభివృద్ధి చెందాలని దానికోసం నిర్చయించుకున్నట్లు మోదీ వెల్లడించారు. తప్పకుండా 2047కు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఆధునిక మౌలిక సదుపాయాలు చాలా అవసరం. అందువల్ల, ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం రూ.11 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ గరిష్ట ప్రయోజనం పొందాలని కేంద్రం కోరుతోందని పేర్కొన్నారు.
ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులలో ఎక్కువ శాతం రోడ్డు, రైలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ వంటి రంగాలకు సంబంధించినవి ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా పౌర విమానయాన రంగంలో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను అప్గ్రేడ్ చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు.