
సాక్షి, కరీంనగర్: హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు చాలామంది సంసారాలు నాశనం చేశారు.. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అందరికంటే ఎక్కువ ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు చేసింది నేనే. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక మంది ఉసురు పోసుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.
ప్రభాకర్ రావు సీఎంవో ఆఫీసుని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి. అందరి జీవితాలు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. నన్ను పేపర్ లీక్ అయ్యిందని ప్రభాకర్ రావు అదేశాల మేరకే అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణను సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారు?. కేటీఆర్ అమెరికా పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఇండియాకు వచ్చాడు. నాకు సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. విచారణకు హాజరవుతాను’ అని స్పష్టం చేశారు.
