లోక్‌సభ టుడే రౌండప్‌.. ప్రధాని స్పీచ్‌ హైలైట్స్‌ | Parliaments Roundup 2 july 2024 | Sakshi
Sakshi News home page

లోక్‌సభ టుడే రౌండప్‌.. ప్రధాని ప్రసంగం హైలైట్స్‌

Jul 2 2024 8:03 PM | Updated on Jul 2 2024 8:31 PM

Parliaments Roundup 2 july 2024

లోక్‌సభ సమావేశాలు మంగళవారం(జులై 2) హాట్‌హాట్‌గా జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత ఉదయం విపక్ష పార్టీల సభ్యులు పలువురు మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై జరిగిన చర్చకు సాయంత్రం ప్రధాని మోదీ సమాధానమిచ్చారు.

ప్రధాని ప్రసంగిస్తుండగా లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు ఒక దశలో వెల్‌లోకి దూసుకువచ్చారు. నీట్‌, అగ్నివీర్‌లపై ప్రధాని  స్పందించాలని డిమాండ్‌ చేశారు. చివరకు సభలో నీట్‌పై ప్రధాని ప్రకటన చేయక తప్పలేదు. ప్రధాని ప్రసంగం పూర్తయిన తర్వాత సభను స్పీకర్‌ నిరవధిక వాయిదా వేశారు. 

కాంగ్రెస్‌,రాహుల్‌ టార్గెట్‌గా ప్రధాని ప్రసంగం.. 
ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్‌, ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీని లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. ముఖ్యంగా రాహుల్‌ సోమవారం సభలో చేసిన ప్రసంగానికి కౌంటర్‌గా ప్రధాని స్పీచ్‌ సాగింది. ఇటీవలి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్డీఏను ఓడించామనే భ్రమలో ఉందని  ప్రధాని ఎద్దేవా చేశారు. 

వరుసగా మూడుసార్లు ప్రజలు కాంగ్రెస్‌ను 100 సీట్లలోపే పరిమితం చేశారని ప్రధాని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చింది 100 కాదని 99 సీట్లని గుర్తుచేశారు. మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన చోటే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని, సింగిల్‌గా పోటీచేసిన చోట కాంగ్రెస్‌ చతికిలపడిందన్నారు.

ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని, సింపథీ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. తాము పదేళ్ల పాలనలో కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, ప్రపంచంలోనే భారత్‌ను మూడవ అతిపెద్ద  ఎకానమిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. చివరగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రధాని సంతాపం ప్రకటించారు. 

నీట్‌పై ప్రకటన చేసిన ప్రధాని 
నీట్‌  అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వంపై విపక్షాల ఒత్తిడి  పనిచేసింది. ప్రధాని లోక్‌సభ ప్రసంగంలో నీట్‌ పేపర్‌లీక్‌పై స్పందించారు.  పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామన్నారు.

స్పీచ్‌ తొలగించడంపై రాహుల్‌ షాక్‌..
అంతకుముందు రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలో కొన్ని వివాదాస్పద అంశాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. 

ఈ ప్రకటనపై రాహుల్‌గాంధీ స్పందించారు. తన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యానన్నారు. తన మాటాలను పునురుద్ధరించాలని స్పీకర్‌కు ఓం బిర్లాకు లేఖ రాశారు. 

ఈవీఎంలపై అఖిలేష్‌ సంచలన కామెంట్స్‌.. 
లోక్‌సభ మార్నింగ్‌ సెషన్‌లో మాట్లాడిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో  ఇండియా కూటమి నైతిక విజయం సాధించిందన్నారు. బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైందన్నారు. జూన్‌ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించిందని తెలిపారు. 

వర్షాలు వస్తే  ఉత్తరప్రదేశ్‌లో నగరాలు చెరువులయ్యాయని విమర్శించారు. తమకు 80 సీట్లు వచ్చిన ఈవీఎంలను నమ్మేది లేదని అఖిలేష్‌ తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడిచేది కాదని, పడిపోయే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

ఎన్నికలు బాండ్లు పెద్ద స్కామ్‌: కేసీ వేణుగోపాల్‌ 
కాగా, రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

బీజేపీలో  పాలనలో ఢిల్లీ ఎయిర్‌ పోర్టు, జబల్‌పూర్‌  ఎయిర్‌పోర్టుల పైకప్పులు కూలిపోయాయన్నారు. అయోధ్యలో రోడ్లు అధ్వానంగాఉన్నాయని, రామ మందిరంలో నీరు లీక్‌ అవుతోందన్నారు. ముంబై హార్బర్‌ లింక్‌ రోడ్డుకు పగుళ్లు  వచ్చాయని విమర్శించారు. 

ఉదయం ఎన్డీఏ  ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం
ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎన్డీయే కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్‌లో ఎంపీలంతా  నిబంధనలను పాటించాలని కోరారు. 

లోక్‌సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని, సభ జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలన్నారు. 

రాజ్యసభలో ఖర్గేకు చైర్మన్‌ షాక్‌..
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఏఐసీసీ చీఫ్‌, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున్‌ ఖర్గే రాజ్యసభలో సోమవారం తన ప్రసంగంలో భాగంగా చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. 

తిరిగి మంగళవారం కూడా చైర్మన్‌ ధన్‌ఖడ్‌, ఖర్గే మధ్య వాదనలు జరిగాయి. చైర్మన్‌ సీటుకు ఖర్గే అసలు గౌరవమే ఇవ్వడం లేదని దన్‌ఖడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే స్థానంలో జైరాం రమేష్‌ ఉంటే బాగుండేదని ధన్‌ఖడ్‌ అనడం చర్చనీయాంశమైంది. 

ఇక కాళ్ల నొప్పులతో తాను నిల్చొని మాట్లాడలేకపోతున్నాని ఖర్గే అనడంతో కూర్చొని మాట్లాడేందుకు ధన్‌ఖడ్‌ అనుమతించారు. తనను ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చోబెట్టింది సోనియాగాంధీ అని ఖర్గే  అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement