
సాక్షి, అమరావతి: కరోనా వంటి విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా పేదలకు ఉపాధి కల్పిస్తే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కొందరు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ పథకం గురించి తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేస్తూ కూలీలకు పనిలేకుండా చేసి వారి జీవనోపాధికి గండికొట్టాలని చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
2020 జూలై 16న, గత ఏడాది జూలై 14న, నవంబర్ 26న, ఈ ఏడాది ఆగస్టు 22న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. అవన్నీ తప్పుడు ఫిర్యాదులు కావడంతో కేంద్రం ఎలాంటి చర్యలకు పూనుకోలేదని పేర్కొన్నారు.
ఉపాధిహామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు అతిక్రమించలేదని తెలిపారు. రాష్ట్రంలో పేదల ఉపాధికి గండికొట్టేలా చంద్రబాబుకు మద్దతు పలికే పత్రికలు కూడా తప్పుడు కథనాలు రాస్తున్నాయని పేర్కొన్నారు. నిరాధారమైన, అవాస్తవమైన వివరాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేవారు.