పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్? | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్?

Published Thu, Apr 25 2024 3:20 PM

MP Venkatesh Netha Meets Kishan Reddy Twist In Peddapalli Mp Ticket

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్‌ కొట్టు... టికెట్‌ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్‌ అయితే ఆయ్యారు కానీ అవతల టికెట్‌ ఇవ్వాల్సిన వాళ్లు మాత్రం కామ్‌గా చేతులెత్తేస్తున్నారు. దీంతో నెక్ట్స్‌ ఏం చేయాలో తోచని ఆయోమయ పరిస్థితుల్లో మరో పార్టీకి జంప్‌ ఆలోచనలో ఉన్నారు ఎంపీ వెంకటేష్‌.

తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. 

అయిన్పటికీ గోమాస శ్రీనివాస్‌ నేడు నామినేషన్‌ వేశారు. ఈ క్రమంలో అసలు పెద్దపల్లి బీఫామ్‌ను బీజేపీ ఎవరికి ఇవ్వనుంది, వెంకటేష్‌ నేత అసలు పోటీ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నామినేషన్ చివరి రోజైన రేపు(గురువారం) పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 

కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నాయకుడైన వెంకటేష్‌ నేత గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున ఎంపీగా గెలిచారు. అయితే మళ్లీ బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ వస్తుందో రాదో అని భావించిన వెంకటేష్‌.. ఇటీవలే కాంగ్రెస్‌ గూటికి చేరారు. కేవలం ఎంపీ టికెట్‌ కోసం కండువా మార్చేసినా.. చివరికి నిరాశే మిగిలింది. పెద్దపల్లి ఎంపీ టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ మొండిచేయి చూపింది. గడ్డం వివేక్‌ కొడుకు వంశీకి టికెట్‌ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉండి ప్రయోజనం లేదంటూ మళ్లీ పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వెంకటేష్‌ నేత బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

Advertisement
Advertisement