10,778 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు: మంత్రి కన్నబాబు | Sakshi
Sakshi News home page

10,778 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు: మంత్రి కన్నబాబు

Published Wed, Dec 8 2021 8:05 AM

Minister Kurasala Kannababu Comments On RBKs - Sakshi

సాక్షి, అమరావతి: సహజ సేద్యాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల్లో 10,778 ప్రత్యేక కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డు సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారని తెలిపారు. రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. వ్యవసాయ, ఇతర ప్రాధాన్య రంగాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థ మంచి పనితీరు కనపరిచిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ఇదే సమయంలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు మరింత ప్రాధాన్యం కల్పించాల్సి ఉందన్నారు.

కోవిడ్‌ కారణంగా విద్యా, గృహ రుణాల పరిమితి కొంత మందకొడిగా ఉందని, వీటిపై కూడా మరింత దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ కె.నిఖిల, నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌ జన్నావర్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement