అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు! | KSR Comment On Kutami Red Book Applying IAS Officers Too | Sakshi
Sakshi News home page

అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!

Apr 2 2025 10:54 AM | Updated on Apr 2 2025 11:28 AM

KSR Comment On Kutami Red Book Applying IAS Officers Too

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన  సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. 

.. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు.  ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 

👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న  భావన కలిగించడం ఆయన లక్ష్యం. 

పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే  ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.

👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్‌ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు  అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన  యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు  ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే  టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న  కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు  లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. 

ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 

👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు  లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 

👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేన‍ంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన  హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు  తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు  కదా!. 

గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు  చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే  అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే  పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 

👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది.  కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు  అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు  పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్‌సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన  మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..

అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై  వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన  హామీలన్నిటికి ఐఏఎస్‌ అధికారులు జవాబుదారులు  అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే  ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement