ఉచ్ఛ నీచాల్లేని వ్యక్తి చంద్రబాబు  | Kodali Nani Sensational Comments On Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

ఉచ్ఛ నీచాల్లేని వ్యక్తి చంద్రబాబు 

Jan 19 2024 5:18 AM | Updated on Feb 2 2024 8:29 PM

Kodali Nani Sensational Comments On Chandrababu Naidu - Sakshi

గుడివాడ టౌన్‌: రాజకీయాల్లో ఉచ్ఛం, నీచం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నాని గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన చూపిన మార్గమే తనకు ఆదర్శమని  అన్నారు.

ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింన ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యుల చేతిలో, అధికార దాహంతో అల్లాడుతున్న ఒక మోసకారి చేతిలో వంచనకు గురై పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనో వేదనతో మృతి చెందారన్నారు. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పాడో, పార్టీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని అధికారంలోకి వచ్చాడో వాడే, ఆ గజదొంగే ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నాడన్నారు. ఇటువంటి నక్కజిత్తుల వేషాలను ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. తెలంగాణలో ప్రజలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారన్నారు.

2024 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైతం టీడీపీని, చంద్రబాబు నాయకత్వాన్ని కనుమరుగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బ్రతికుండగా దుర్మార్గుడని, పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి పదవి నుంచి దింపేసిన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండలెయ్యడం, వర్ధంతులు చేస్తామనడం మోసపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

బాబుని రా కదలిరా.. అంటున్న సెంట్రల్‌ జైలు 
చంద్రబాబు రా కదలిరా అని జనంలోకి వస్తుంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలు ఆయన్ని రా కదలిరా.. అని పిలుస్తోందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కన్ను పని చేయడంలేదు, కిడ్నీ పని చేయడంలేదు, ఇంకా ఏదో పని చేయడంలేదు అంటూ జిత్తులమారి నక్కలా తప్పించుకుంటున్న 420 గాడిని రాజమండ్రి సెంట్రల్‌ జైలు కదలి రమ్మనిపిలుస్తోందని, ఆయన త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. త్వరగా జైలుకు వెళ్లు అని సుప్రీంకోర్టు బాబును ఆదేశించిందన్నారు. 

ఎన్టీఆర్ వారసుడు జూనియర్‌ ఎన్టీఆరే 
ఎన్టీఆర్‌ వారసులమని కుటుంబ సభ్యులు చెప్పుకుంటుంటే.. ప్రజలు మాత్రం జూనియర్‌ ఎన్టీఆర్నే ఆయనకు నిజమైన వారసుడిగా గుర్తిస్తున్నారని నాని చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపు కుటుంబ సభ్యుల నీచమైన బుద్ధిని తెలియజేసిందే తప్ప జూనియర్‌ ఎన్టీఆర్కు జరిగే నష్టం ఏమీలేదన్నారు. తన అల్లుడు పప్పుగాడిని పైకి లేపేందుకు బాలకృష్ణ ఇటువంటి నీచమైన కార్యాలకు తెరలేపారన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు లాంటి వారు వందల మంది వచ్చింనా జూనియర్‌ ఎన్టీఆర్కు ఊడేదేమీలేదన్నారు

  చంద్రబాబు ఇంతకు ముందు కూడా తనకు డిపాజిట్లు రాకుండా చేస్తానంటూ వీరంగం వేశారని, కానీ తాను నాలుగుసార్లు శాసన సభ్యునిగా గెల్చానని తెలిపారు. గుడివాడలో తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు మారుతున్నారు తప్ప తన గెలుపులో ఏమాత్రం తేడా లేదన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండటం, ఆయన పాలన కొనసాగడం తనకు ముఖ్యమని, పదవులు ఈకతో సమానమని అన్నారు. ప్రతి పార్టీకీ గెలవాలనే లక్ష్యం ఉంటుందని, గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వడం పార్టీ అధినేత ఆలోచన అని చెప్పారు.

ఇవన్నీ సర్వ సాధారణమని, వీటితో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు. 1978లో చంద్రగిరిలో గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఓడిపోలేదా అని ప్రశ్నించారు. ఆయన సీఎం అయ్యాక జరిగిన 5 ఎన్నికల్లో చంద్రగిరిలో ఒక్కసారైనా గెలిచారా అని అన్నారు. గన్నవరంలో గెలిచిన గద్దె రామ్మోహన్‌రావును విజయవాడలో, నందిగామలో గెలిచిన దేవినేని ఉమను మైలవరంలో, కొవ్వూరు నుంచి తెచ్చిన జవహర్‌ను తిరువూరులో బాబు ఎందుకు పోటీ చేయిస్తున్నాడని అన్నారు. బాలయ్య హిందూపూర్‌లో పుట్టాడా? వాడికి కొంపాగోడు ఉందా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ నక్కజిత్తుల చంద్రబాబు మాటలు నమ్మరని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement