Karnataka PCC Chief DK Shivakumar Emotional After Congress Victory - Sakshi
Sakshi News home page

DK Shivakumar: అదిరిపోయిన ఎన్నికల ఫలితాలు.. ఏడ్చేసిన డీకే శివకుమార్

Published Sat, May 13 2023 1:53 PM

Karnataka PCC Chief DK Shivakumar Emotional After Congress Victory - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయదుందుబి మోగించడంతో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్‌కు విజయాన్నందించి తమపై విశ్వాసం ఉంచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం శ్రమించిన ప్రతిఒక్కరిని అభినందించారు. కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు.

కలసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే తాను చెప్పానని, అందరం సషష్టిగా కృషి చేయడం వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని డీకే చెప్పారు. సిద్ధరామయ్య సహా విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి  నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే బీజేపీ తనపై తప్పుడు కేసులు మోపి జైల్లో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనను చూసేందుకు వచ్చారని గుర్తు చేసుకుని డీకే ఏమోషనల్ అయ్యారు. తాను ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా జైలుకెళ్లేందుకు సిద్ధపడ్డానని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో ఎలాగైనా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చెప్పామని, ఇప్పుడు ప్రజల తీర్పు తమవైపే ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

కాగా.. కనకపుర స్థానం నుంచి వరుసగా నాలుగోసారి గెలుపొందారు డీకే శివకుమార్. సీఎం పగ్గాలు ఆయన చేపడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి ఫలితాల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్‌ 130 స్థానాలకుపైగా మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ కేవలం 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్‌ కేవలం 21 స్థానాల్లో ఆదిక్యం కనబరుస్తోంది.
చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే..

Advertisement
Advertisement