అసలు ఉన్నట్టా? లేనట్టా?.. సీఎం రేవంత్‌కి హరీష్‌ లేఖ | Harish Rao Letter To CM Revanth On Brahmin Welfare Parishad | Sakshi
Sakshi News home page

అసలు ఉన్నట్టా? లేనట్టా?.. సీఎం రేవంత్‌కి హరీష్‌ లేఖ

Jul 12 2024 12:03 PM | Updated on Jul 12 2024 12:18 PM

Harish Rao Letter To CM Revanth On Brahmin Welfare Parishad

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఆగమ్య గోచరంగా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. 

''రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?'' అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.

సీఎంగా కేసీఆర్.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారని లేఖలో పేర్కొన్న హరీష్‌రావు.. పలు డిమాండ్లను ప్రస్తావించారు. ‘‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి'' అని కోరారు.

బ్రాహ్మణ ఎంటర్ ప్రెన్యూయల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలి'' అని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement