ఈటలపై భూకబ్జా ఆరోపణలు: కమలాపూర్‌లో హై టెన్షన్‌..

Fans Worried In Etela Rajender Hometown Kamalapur - Sakshi

రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి ఈటల భూ వివాదం

సాక్షి, వరంగల్‌: ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈటల భూ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. కమలాపూర్‌లో ఈటల అభిమానులు ఆందోళనకు దిగారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణచూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

హుజూరాబాద్‌ నుంచి అభిమానులు హైదరాబాద్‌ బయలుదేరారు. ఈటలకు అన్యాయం చేస్తే సహించేది లేదని అభిమానులు అన్నారు. హైదరాబాద్‌లో కూడా మంత్రి ఈటలకు మద్దతుగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ నేతను అక్రమంగా భూ వివాదంలో ఇరికించారని ఆందోళనకు దిగారు. శామీర్‌పేట్‌లో కార్యకర్తల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి.

ఈటల రాజేందర్‌.. 2004 నుంచి ఎమ్మెల్యేగా, ఫ్లోర్‌ లీడర్‌గా, మంత్రిగా టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుల్లో కీలక నేత ఈటల. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు.  

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్‌ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్‌ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరంగా మారింది.

చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్‌ 
ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top