‘సర్‌’ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర’ | Conspiracy To Remove Massive Votes In Name Of SIR, Says Sake Sailajanath | Sakshi
Sakshi News home page

‘సర్‌’ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర’

Jun 17 2026 5:36 PM | Updated on Jun 17 2026 5:56 PM

Conspiracy To Remove Massive Votes In Name Of SIR, Says Sake Sailajanath

సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్‌ లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని శైలజానాథ్ తెలిపారు.

రాష్ట్రంలో ఎస్ఐఆర్‌ను అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సాకే శైలజానాథ్ ఇంకేమన్నారంటే..

ఎస్ఐర్ పేరుతో భారీగా ఓట్లు తొలగించే కుట్ర
ఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్ చేసింది. 16వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాకు ఉన్న అనుమానాలు, మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఫిర్యాదు చేశాం. దీనిపై మా నాయకులు సచివాలయంలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎవరికి మేలు చేయానుకుంటున్నాయి?

చంద్రబాబు ఎలాగో తనకు తాను తప్ప ఎవరికీ మేలు చేయడు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్సార్సీపీకి చెందిన 30 లక్షల ఓట్ల గల్లంతు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాటిని కాపాడుకున్నాం. కాబట్టి ఎన్టీయే నుంచి, టీడీపీ నుంచి పారదర్శకత ఊహించలేం. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్ని చూసిన తర్వాత, బీహార్‌లో మేం బతికే ఉన్నాం అని సుప్రీంకోర్టుకు ఓటర్లు చెప్పుకున్న తర్వాత కూడా న్యాయం జరగలేదు.

ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశాం. వీటిని అనూహ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏపీలోనూ అదే తంతు కొనసాగుతుందని చెప్పడానికి మేం వెనుకాడట్లేదు. ఎస్ఐర్ ప్రక్రియలో వైరస్ తరహాలో టీడీపీ చొరబడింది. మై టీడీపీ యాప్ పెట్టుకుని కుట్రకు తెరలేపింది. ఈ యాప్‌లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దాని కంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయి. బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు.

అనంతపురంలో టీడీపీ కన్నుసన్నల్లో ఎస్ఐఆర్
అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్‌లను మేం పరిశీలించాం. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్‌లో వచ్చింది. ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారు. టార్గెట్‌గా ఓట్లను తొలగిస్తున్నారు. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, అన్ని కులాల్లో పేదల ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతోంది. దీనికి పరాకాష్టగా ఇవాళ శింగనమలలోని ఓ బూత్‌లో నాయీ బ్రహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐర్ ప్రక్రియలో దూరాడు.

పంచాయతీ కార్యదర్శి నిలబడి సమాధానం చెప్తున్నారు. మేం అడ్డుకుంటే పొరబాటు అంటున్నారు. ఇది పొరబాటు కాదు, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర. దళితులు, మైనార్టీలు, పేదల హక్కుల్ని హరించే కుట్ర ఇది. గతంలోనే ఇది నిరూపితమైంది. ఎన్నికల కమిషన్ అధికారులు ప్రజల ఓట్లను న్యాయంగా కాపాడుతున్నారా లేదా అని అడుగుతున్నాం. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు. ఒకాయన ఇందులో ఏం తప్పుందని అడుగుతున్నారు. ఓటరుకు సంబంధించిన ప్రతీ విషయం గోప్యంగా ఉండాలన్న విషయం మీకు తెలియదా? ప్రజల ఓట్లు లేకుండా చేయడానికి భారీ కుట్ర జరుగుతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.

ఈసీ పారదర్శకంగా ఎస్ఐఆర్ నిర్వహించాలి
శింగనమల నియోజకవర్గ కేంద్రంలోనే ఇలా జరుగుతోందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతోందో ఊహించుకోవచ్చు. మీ సీఐలు ఉన్నా ఇలాఖాలో అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫామ్‌లు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. ఇది వదిలేసి, బుక్క రాయసముద్రంలో ఏటీఎం ఎత్తుకుపోతే అది పెద్ద విషయమని పోలీసులంతా అక్కడికి వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల హక్కు ముఖ్యం కాదా? ఎస్ఐర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయి.

క్షేత్రస్దాయిలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల తీరు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. సర్ ప్రక్రియ కట్టుదిట్టంగా జరగాలి. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వైఎస్సార్సీపీ భారీ పోరాటాలకు సిద్ధంగా ఉంది. కులం, మతం, పార్టీ, ప్రాంతం, అధికారం పేరు చెప్పి ఓటర్లను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఎన్నికల కమిషన్ అధికార  పార్టీ ప్రభావానికి లోనుకాకుండా ఎస్ఐర్ ప్రక్రియను నిర్వహించాలి. ఈ ప్రక్రియలో తప్పిదాలు జరిగితే అంతిమంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని సాకే శైలజానాథ్ హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement