నేడు పొంగులేటి నివాసానికి రేవంత్‌ | Congress Leader Revanth Reddy To Meet Ponguleti Srivasa reddy | Sakshi
Sakshi News home page

నేడు పొంగులేటి నివాసానికి రేవంత్‌

Jun 21 2023 4:42 AM | Updated on Jun 21 2023 4:42 AM

Congress Leader Revanth Reddy To Meet Ponguleti Srivasa reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలోకి వెళతారన్న దానిపై సస్పెన్స్‌ క్రమంగా వీడుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆ ఇద్దరూ సిద్ధమయ్యారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊతమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ఆ ఇద్దరితో భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన ముందుగా అత్తాపూర్‌ సమీపంలోని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు.

అక్కడ జూపల్లితో భేటీ అయి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం జూపల్లిని వెంటబెట్టుకుని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఉన్న పొంగులేటి నివాసానికి వస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. అక్కడే ముగ్గురు నేతలతో పాటు మరికొందరు ముఖ్యులు భోజనం చేస్తారని, ఆ సమయంలోనే రేవంత్‌రెడ్డి వారందరినీ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.

రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఢిల్లీకి
పొంగులేటి అండ్‌ టీంతో సమావేశమైన తర్వాత రేవంత్‌రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. విదేశాల నుంచి ఢిల్లీకి వస్తున్న రాహుల్‌తో గురువారం రేవంత్‌ సమావేశమవుతారని, ఆయనతో మాట్లాడిన తర్వాత పొంగులేటి అండ్‌ టీం కలిసేందుకు రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 25న లేదంటే నెలాఖరులోపు ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ వీలును బట్టి పొంగులేటి, జూపల్లి అండ్‌ టీం ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement