ఆ రెండు పార్టీల ప్రయత్నాలు ఫలించవు | CM Revanth Reddy Comments On BRS And BJP | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీల ప్రయత్నాలు ఫలించవు

Apr 8 2024 1:46 AM | Updated on Apr 8 2024 1:46 AM

CM Revanth Reddy Comments On BRS And BJP - Sakshi

బీఆర్‌ఎస్‌ పనైపోయింది.. బీజేపీకి చెప్పేందుకేమీ లేదు

సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలి

సికింద్రాబాద్, వరంగల్‌ నియోజకవర్గాల సమీక్షలో సీఎం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పనై పోయిందని, తాము చేసింది చెప్పి ఓట్లడిగేందుకు బీజేపీ దగ్గర ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలు ఫలించ బోవని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సాను కూల రాజకీయ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు.

ఆదివారం జూబ్లీ హిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సికింద్రా బాద్, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు. పార్టీ అభ్యర్థులు దానం నాగేందర్, కడియం కావ్యలతో పాటు వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, కె.ఆర్‌. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్‌ నేతలు అజారుద్దీన్, విజయారెడ్డి, ఫిరోజ్‌ఖాన్, రోహిణ్‌రెడ్డి, ఆదం సంతోష్‌ తదితరులు హాజరయ్యారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలి
సికింద్రాబాద్‌ సమీక్షలో భాగంగా రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఇక్కడ గెలిచిందని, ఇప్పుడు కూడా గెలవడం ద్వారా హైదరాబాద్‌ నగరంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కో రారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికి పరిస్థితిలో మార్పు వచ్చిందని, జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌ బలం పెరిగినందున ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలందరితో కలిసి సమన్వ యంతో ముందుకెళితే గెలుపు కష్టమేమీ కాదని చెప్పారు.

హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ ఉందని చెప్పేందుకు సికింద్రాబాద్‌ గెలుపు అవసరమని స్పష్టం చేశారు. వరంగల్‌ సమీక్ష సందర్భంగా.. సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఇక్కడి నుంచి బరి లో దింపుతున్నందున అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు కష్టపడి పనిచేయాలని, కావ్య గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, బూత్‌ స్థాయి నుంచి కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పారు. 

నేడు కొడంగల్‌కు సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన సొంత నియో జకవర్గమైన కొడంగల్‌కు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మండలాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత సా యంత్రానికి ముఖ్యమంత్రి హైదరాబాద్‌ చేరుకుంటారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement