ఆ మాటలు గుర్తున్నాయా చంద్రబాబూ.. మంత్రి వేణు ఫైర్‌ | Chelluboina Venugopala Krishna Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ మాటలు గుర్తున్నాయా చంద్రబాబూ.. మంత్రి వేణు ఫైర్‌

Apr 13 2024 5:19 PM | Updated on Apr 13 2024 6:20 PM

Chelluboina Venugopala Krishna Comments On Chandrababu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ‘‘నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తన అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.

‘‘తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా?. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా.? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు.

‘‘బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు.. ఇదో పెద్ద అబద్ధం.. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా.. సీఎం జగన్ పింఛన్లు పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా.. మీ పార్టీ ఏనాడైన బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా?. ఇవాళ సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు శెట్టిబలిజలకు కేటాయించలేకపోయాడు. రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావ్. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సగానికి సగం తగ్గించి బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు’’ అంటూ మంత్రి వేణు దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement