పరుష పదజాలం.. ప్రజలపై ప్రతాపం
గుంటూరులో అవమానకర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
సాక్షి, గుంటూరు: ‘మీకు సిగ్గు, రోషం లేదా. గుంటూరు కారం తిన్న పౌరుషం ఏమైంది. యువతలో చేవ చచ్చిపోయిందా’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పరుష పదజాలంతో ప్రజలు, యువతపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుంటూరు ప్రజలు బతికున్నా బతికున్నట్టు కాదని, సిగ్గుంటే వైఎస్సార్సీపీ జెండా పట్టుకుని తిరుగుతారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాను సీఎం అయ్యాక పోలీసులు నమోదు చేసిన కేసులన్నింటినీ సమీక్షిస్తానన్నారు.
అమరావతి కోసం మీరు రావడం లేదు
అమరావతి కోసం రాజధాని ప్రాంతంలో ఆందోళనలు జరుగుతుంటే గుంటూరు ప్రజలు ఏం పట్టనట్టు ఉన్నారంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘అమరావతి రాజధాని కోసం గుంటూరు ప్రజలు ఏం చేశారు. మీకు రోషం, కసి ఉందా. ఉంటే ఎందుకు అమరావతి ఆందోళనలను పట్టించుకోవడంలేదు’ అని ప్రశ్నించారు. గుంటూ రు కార్పొరేషన్ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటే రాజధాని వికేంద్రీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో అమరావతి, ప్రజా వ్యతిరేకతే టీడీపీ అజెండా అని చెప్పారు.