
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అడ్డంగా రూ.కోట్లు కొట్టేసిన చంద్రబాబును గోదావరి, కృష్ణా నది తీరాల్లో సన్మానించాలన్నట్లు టీడీపీ నేతల తీరు ఉందని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దుయ్యబట్టారు. రూ.వందల కోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయకుండా సన్మానించాలా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు.
నైపుణ్యాభివృద్ధి పేరిట చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై శాసన మండలిలో బుధవారం చర్చ జరిగింది. పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడిన అనంతరం స్కిల్ స్కామ్లో తీసుకున్న చర్యలపై మంత్రి బుగ్గన సమాధానమిస్తూ.. చంద్రబాబు హయాంలో పథకం ప్రకారం ప్రజాధనాన్ని వేగంగా కొట్టేయాలనుకునే స్కీమే తప్ప.. అది స్కిల్ స్కీమ్ కాదన్నారు.
పథకం ప్రకారమే ‘స్కిల్ స్కామ్’
మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ‘ప్రజాధనాన్ని ప్రభుత్వ పెద్దలుగా కాపాడాలి. ఆ డబ్బును సక్రమంగా వినియోగించాలి. రాష్ట్ర భవిష్యత్ను నిరి్మంచే గౌరవ స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా మెలగాలి. చంద్రబాబు అండ్ కో పథకం ప్రకారమే కుంభకోణానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి అందులో రూ.250 కోట్లను షెల్ కంపెనీల ద్వారా సునాయాసంగా దోచేశారు’ అన్నారు.
‘ఒప్పందాల నుంచి ప్రభుత్వ నిధుల విడుదల వరకు అన్నీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. గుజరాత్లో జరిగిన ఎంవోయూలో సంతకం చేసిన సీమెన్స్ ఎండీ సౌమేంద్ర బోస్, ఏపీకి వచ్చేసరికి సుమన్ బోస్ ఎలా అయ్యారు. అవగాహన ఒప్పందంలో తేదీ వివరాలు, లెటర్ నంబర్, ఏ రోజు, ఏ నెల అనే వివరాలు ఎందుకు లేవు. అలా ఎంవోయూ చేయడం సాధ్యమా. నిద్రపోయిన వారిని తట్టి లేపవచ్చు కానీ.. నిద్ర నటించే ప్రతిపక్షాలను ఏం చేయగలం’ అన్నారు.
ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తారా?
‘దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే క్లస్టర్లను నెలకొల్పాలని 2015లో చంద్రబాబు ప్రభుత్వం తీర్మానించింది. ఇందులో ఒక్కో సెంటర్కు అయ్యే రూ.546.84 కోట్ల ఖర్చులో 90శాతం సీమెన్స్, డిజైన్ టెక్, మరో పది శాతం నిధులను ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కొక్క సెంటర్ను సీమెన్స్, డిజైన్ టెక్ రూ.491,84,18,908 గ్రాంటు ఇన్ ఎయిడ్గా, రూ.55 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాతో ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో హుటాహుటిన రూ.185 కోట్లు చెల్లించింది. 2016లో రూ.85 కోట్లు, ఆ తరువాత రూ.67 కోట్లు, రూ.34.25 కోట్లు విడతల వారీగా ప్రభుత్వం నిధులు ఇచ్చేసింది.
వాస్తవానికి ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లు అయినప్పటికీ 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ వాటా ఇవ్వకుండానే ప్రభుత్వం రూ.371.25 కోట్లు విడుదల చేసినప్పటికీ ఓచర్ వివరాలు లేకుండా డిజైన్ టెక్ యూసీ మాత్రమే ఇచ్చింది. ఆ డబ్బులు డొల్ల కంపెనీల ద్వారా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేర్చారు’ అని చెప్పారు. స్కిల్ స్కామ్ ఎలా బయటపడిందో కూలంకషంగా వివరించారు. స్కిల్ స్కామ్లో ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు మనుషులు ఎందుకు పారిపోతున్నారని బుగ్గన ప్రశ్నించారు.