ల్యాటరల్‌ ఎంట్రీ దుమారం.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ | Centre U Turn On Lateral Entry Amid Pressure From Ally Opposition | Sakshi
Sakshi News home page

ల్యాటరల్‌ ఎంట్రీ దుమారం.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌

Aug 20 2024 3:18 PM | Updated on Aug 20 2024 3:32 PM

Centre U Turn On Lateral Entry Amid Pressure From Ally Opposition

న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖలలో ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని 45 కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన ‘ల్యాటరల్‌ ఎంట్రీ’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్‌ వెనక్కి తగ్గింది.

ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ నిర్ణయం సామాజిక న్యాయంతో ముడిపడి ఉండాలని పేర్కొన్నారు. యూపీఎస్‌సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని యూపీఎస్‌సీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

కాగా గతవారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాల్లో ‘ల్యాటరల్‌ ఎంట్రీ’ద్వారా నియమాకాల కోసం ప్రతిభావంతులైన భారతీయులు కావాలంటూ యూపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంత్రిత్వ శాఖలలో 45 పోస్టులు ఉన్నాయి. 

వీటిలో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు. ఈ పోస్టుల నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేక వ్యక్తమవుతుండటంతో కేంద్ర మంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్య స్థాయి, సీనియర్‌ స్థాయి పదవులను సాధారణంగా ఐఏఎస్‌ వంటి సివిల్‌ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తారు. అయితే ఈ పదవులను సివిల్‌ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడాన్నే ‘ల్యాటరల్‌ ఎంట్రీ’అంటారు. మూడేళ్లు, అయిదేళ్ల ఒప్పందంతో వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని ప్రధానిగా మోదీ తొలి హయాంలో 2018లో అమలు చేశారు.

ఈ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య లోక్‌ జనశక్తి పార్టీ(రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ పద్దతిని తప్పుపట్టారు. దానిని జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement