
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహం సరైన పద్దతి కాదు. మేము ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునే అవసరం మాకు లేదు అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
కాగా, బండి సంజయ్ ఆదివారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం, సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో సింగరేణిని ప్రైవేటుపరంగా చేస్తున్నామని మాట్లాడటం హాస్యాస్పదం. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. ఈ వాటాతో కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుంది.
అలాగే, రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు. గతంలో బీఆర్ఎస్ నడిచిన బాటలోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పయనం కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. మరి మేము కూడా అలాగే ఆలోచిస్తే అనే విషయాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. మేము ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను మా పార్టీలో కలుపుకునే అవసరం మాకు లేదు. జనసేనతో పొత్తు అంశం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు చూసుకుంటారు’ అని అన్నారు.
ఇదే సమయంలో టీ20 ప్రపంచకప్లో భారత్ విజయంపై బండి సంజయ్ స్పందిస్తూ..‘వరల్డ్కప్ గెలుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు. ప్రతీ భారతీయుడు తామే విజయం సాధించినంత గొప్ప అనుభూతిని ఈ విక్టరీ అందించింది’ అని కామెంట్స్ చేశారు.