కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత | BRS MLC Kavitha Serious Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత

Feb 15 2025 12:59 PM | Updated on Feb 15 2025 1:07 PM

BRS MLC Kavitha Serious Comments On Congress Govt

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్‌ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని హితవు పలికారు. అలాగే, పరిపాలన చేయడం చేతగాక బీఆర్‌ఎస్‌ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఖమ్మం జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం, కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ​ప్రశ్నించిన సురేందర్‌ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టీ జైలుకు పంపడం సరికాదు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వెలగపెట్టింది ఏమీ లేదు. మీ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతాం. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.

కేసీఆర్‌ను  కట్టడి చేయాలని చూస్తున్నారు. పార్టీకి చెందిన వారిని కొందరని అరెస్ట్‌ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్టా?. రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్‌ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్‌ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే ఉందాం’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement