విపక్షాల ఐక్యత చెడగొట్టడమే అతని పని | Breaking Opposition Unity Is Arvind Kejriwal Motive Ajay Maken | Sakshi
Sakshi News home page

ఒకపక్క తిడతారు.. మరోపక్క మద్దతు అడుగుతారు.. ఇదేం పద్దతి 

Jun 25 2023 4:48 PM | Updated on Jun 25 2023 8:43 PM

Breaking Opposition Unity Is Arvind Kejriwal Motive Ajay Maken - Sakshi

న్యూఢిల్లీ: జూన్ 23న బీహార్ వేదికగా జరిగిన విపక్షాల ఐక్య సమావేశం తరవాత నుండి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ రెండు పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మార్కెట్ అంతా విద్వేషాలుంటే అందులో రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచారని ఎద్దేవా చేస్తే.. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విపక్షాల ఐక్యతను దెబ్బ తీయడమే అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యమని అన్నారు. 

ఢిల్లీ ఆర్దనెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును కూడా కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఆ పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. 

ఈ సందర్బంగా ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తరచుగా ప్రేమ గురించి మాట్లాడుతూ బీజేపీ ద్వేషాన్ని రెచ్చగొడుతోందని అంటున్నారు. మరి మొహబ్బత్ కి దుకాన్ పేరిట ప్రేమ దుకాణాన్ని తెరచిన ఆయన ఎవరు ఏమి కోరినా ప్రేమతో అంగీకరించాలి కదా? ఇప్పుడు అయన అధికారంలో లేరు కాబట్టి ఆయనలో ఇగో లేదు. రేపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో వస్తే ఏమిటి పరిస్థితి? ఆయన సంయమనంతో వ్యవహరించి ప్రేమతత్వాన్ని చాటుకోవాలని అన్నారు. 

ఇక కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాత్రం ఆప్ నేతలపైనా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒకపక్క ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మా మద్దతు కోరతారు.. మరోపక్క మాపైనే విచక్షణారహితంగా విమర్శలు చేస్తారు. ఢిల్లీ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంతం నెగ్గించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు తప్పనిసరి. మరి అలాంటప్పుడు కాళ్లబేరానికి వెళ్ళకుండా కయ్యానికి కాలు దువ్వుతుండడం ఆశ్చర్యకరమే మరి. ఈ రెండు నాలుకల ధోరణి వలన ఎవరికి ప్రయోజనం? నాకైతే ఒక్కటే ప్రయోజనం కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ పక్కలో చేరారు. విపక్షాలు ఐక్యత చెడగొట్టడమే ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్య లక్ష్యమని అన్నారు.         

ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి 
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement