ఈటల విజయంతోనే కేసీఆర్ పతనం
బీజేపీ హుజూరాబాద్ మేనిఫెస్టో విడుదల చేసిన తరుణ్ చుగ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయంతోనే కేసీఆర్ పతనం మొదలవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్చుగ్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్లో బీజేపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి, సీఎం కేసీఆర్ అహంకారానికి నడుమ జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు.
అణగారిన వర్గాల గొంతు శాసనసభలో వినిపించాలంటే ప్రజలు ఈటల రాజేందర్ను గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలో కుక్కను/చెప్పును నిలబెట్టినా గెలుస్తామని అహంకారంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్–టీఆర్ఎస్ మధ్య రహస్య దోస్తీ నడుస్తోందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కారు పేద, గ్రామీణులకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కానీ కేసీఆర్ సర్కారు మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులను స్వాహా చేస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అమలుచేసే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను హుజూరాబాద్లో పటిష్టంగా అమలు చేస్తామని, హుజూరాబాద్ కేంద్రంగా వ్యవసాయ, రైల్వే వసతులను మెరుగుపరుస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు తరుణ్చుగ్ తెలిపారు.