రేవంత్‌రెడ్డికి చిప్‌ దొబ్బింది  | Balka Suman Fires On Tpcc Chief Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డికి చిప్‌ దొబ్బింది 

Feb 28 2022 4:02 AM | Updated on Feb 28 2022 4:06 AM

Balka Suman Fires On Tpcc Chief Revanth Reddy - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు గోపీనాథ్, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని తక్షణమే ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రిలో చేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. రేవంత్‌కు నాయకుడు అఖిల భారత పప్పు అయితే.. రేవంత్‌ తెలంగాణకు పప్పుగా తయారయ్యా డని ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని, జైలులో చిప్ప కూడు తిన్నాక చిప్‌ దొబ్బిందని ఘాటుగా విమర్శించారు. రేవంత్‌ను తక్షణమే ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించాలని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేస్తూ.. అందుకు తానే ఖర్చులు భరిస్తానన్నారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆదివారం సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్‌ పార్టీకి ఆయనే ఉరితాడుగా మారాడని ఎద్దేవా చేశారు. పరిగిలో పీసీసీ అధ్యక్షుడు కల్లు తాగిన కోతిలా వ్యవహరించారన్నారు. రేవంత్‌ బీజేపీ కోవర్ట్‌ అనే అనుమానం కలుగుతోందని, ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ సీనియర్లను బయటికి పంపించి కాంగ్రెస్‌ను బీజేపీకి అమ్మే పనిలో ఉన్నాడన్నారు. రేవంత్‌కు నిలువెల్లా విషం తప్ప విషయ పరిజ్ఞానం లేదన్నారు. ఒడిశాలో సింగరేణికి చెందిన కోల్‌ బ్లాక్‌లో రూ.50 వేల కోట్ల కుంభ కోణం జరిగిందంటున్నాడని, అస్సలు నైనికోల్‌ బ్లాక్‌లో బొగ్గు విలువ కూడా రూ.50 వేల కోట్లు లేదని రేవంత్‌కు తెలుసా అని ప్రశ్నించారు.

పీయూసీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా ఉనికిని చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌ తెలంగాణ బంధు అయితే రేవంత్‌ తెలంగాణ పాలిట తాలిబన్‌లా మారారని విమర్శిం చారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మాట్లాడుతూ రేవంత్‌ ఓ బ్లాక్‌మెయిలరన్నారు. జూబ్లిహిల్స్‌కు వస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తానని తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement