నా పేరు సాత్విక్. నేను సచ్ దేవా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇటీవల నేను వైజాగ్, అరకు లోయలను సందర్శించాను. ఈ యాత్ర నాకు ఎంతో ఆనందం, కొత్త అనుభవాలను ఇచ్చింది. మొదట మేము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వెళ్లాం. అక్కడ సముద్రపు అలలు, కెరటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సముద్ర తీరంలో నీళ్లలో ఆడుతూ చాలా సరదాగా గడిపాను. అక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. తర్వాత మేము అరకు లోయను సందర్శించాం. అరకు లోయలోని పచ్చని కొండలు, చల్లని వాతావరణం ఎంతో అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా కొండలపైకి వెళ్లి కిందికి చూస్తే మేఘాలు ఆకాశం నుంచి కిందికి దిగివచ్చినట్టుగా కనిపించాయి. ఆ దృశ్యం నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే గిరిజన గ్రామదర్శిని ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అక్కడి గిరిజనుల సంప్రదాయ వస్త్రధారణ చాలా ఆకట్టుకుంది. నేను కూడా వారిలా అలంకరించుకొని ఫొటోలు దిగాను. ఆ అనుభవం చాలా కొత్తగా, ఆనందంగా అనిపించింది. మేము ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఉడెన్ బ్రిడ్జ్, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించాం. ఈ పర్యటన ద్వారా నాకు ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, కొత్త ప్రాంతాల విశేషాలు తెలుసుకున్నాను. ఈ యాత్ర నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
–పేరు: కె. సాత్విక్ పాఠశాల: సచిదేవా స్కూల్. ఊరు: గోదావరిఖని , జిల్లా: పెద్దపల్లి


