ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్ఎఫ్సీఎల్ అలైడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో గురువారం ప్లాంట్ ప్రధాన గేటు ముందు ధర్నా చేశారు. కర్మాగారంలో పనిచేసే మొదటి, సెకండ్ షిఫ్ట్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులతో స్థానికంగా ఉండే నిరుద్యోగ యువత నష్టపోతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎల్కలపల్లి గ్రామ సర్పంచ్ ఎరుకల అంజిబాబు, మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజ్కుమార్, నాయకులు కన్నూరి శంకర్, బెంద్రం రాజిరెడ్డి, కందుల సతీశ్, దెబ్బట మల్లేశ్, ప్రభావిత గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు సమ్మెకు మద్దతుగా నిలిచారు.
ఇంటిబాట పట్టిన వలస కార్మికులు
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ పిలుపునిచ్చారు. కాగా, రామగుండం ఎరువుల కర్మాగారంలో బ్యాగింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గురువారం చేపట్టిన సమ్మెతో ఇంటి బాట పట్టారు. కాగా, సమ్మె ప్రభావంతో కాంట్రాక్ట్ కార్మికులు కొంతమేర విధులు బహిష్కరించారు. కర్మాగారంలో యూరియా ఉత్పత్తి కొనసాగుతుందని ఆర్ఎఫ్సీఎల్ అధికారులు తెలిపారు.


