
మనిషికి ఆధార్.. భూమికి భూధార్
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: సమాజంలో మనిషికి ఆధార్కార్డు ఇచ్చిన మాదిరిగానే.. భూమి ఉన్న రైతుకు భూధార్ కార్డు అందించి భూ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తెచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి శివారు రంగంపల్లిలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూసమస్యలు పెరిగాయని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. రైతుల సమస్యలు అధికారులే పరిష్కరించేలా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెస్తోందని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పీడీ రాజేశ్వర్, తహసీల్దార్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో పూర్తి చేయాలి
సుల్తానాబాద్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో చేపడుతున్న కొత్త నిర్మాణాలపై నిఘా పెట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, కమిషనర్ నిహాజ్ తదితరులున్నారు.
వైద్యులకు కలెక్టర్ అభినందన
అపెండిక్స్ వ్యాధితో బాధపడుతున్న పెద్దపల్లికి చెందిన మహిళకు ప్రభుత్వాసుపత్రిలో సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులు సాయిప్రసాద్, అమరసింహరెడ్డి, సూపరింటెండ్ శ్రీధర్ లను కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలను మెరుగ్గా అందిస్తున్నారని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.