బొబ్బిలి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హత కలిగిన నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలపై కూటమి ప్రభుత్వం కన్ను వేసింది. ఈ ఉద్యోగాల్లో అనర్హులున్నారని వారి ధృవపత్రాల పరిశీలనంటూ పలుమార్లు కార్యాలయాలకు తిప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఏహెచ్ఏలు(యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లు)గా నియమించిన వారికి సంబంధించి మీ సర్టిఫికెట్లు తీసుకుని సమీప పశుసంవర్ధక కార్యాలయాలకు రావాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు మీ సర్టిఫికెట్లు డూప్లికేటు అయ్యుండొచ్చనీ, వాటిని మీ అర్హతలను అనుసరించి ఆయా విద్యాలయాలకు పంపించి నకిలీవో లేక నిజమయినవో నిర్ధారిస్తామని చెప్పడంతో బయటకు చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ ఎవరికై నా చెబితే లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం నుంచి తప్పిస్తారేమోనని ఆందోళన చెందుతూ కూటమి ప్రభుత్వం పిలిచినప్పుడల్లా పశుసంవర్ధక కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు. సర్టిఫికెట్లు అందజేసి స్కాన్ చేయించి పశుసంవర్ధకాధికారులు అడిగిన మేరకు అందజేస్తున్నారు. ఇలా ఒకసారి కాదు పదే పదే రమ్మన్నప్పుడల్లా వెళ్లివస్తూనే ఉన్నారు.
ఆ రెండు విద్యా సంస్థలకు సర్టిఫికెట్లు మెయిల్
యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ల సర్టిఫికెట్లను వారి అర్హతననుసరించి తనిఖీలకు పంపిస్తున్నారు. డిప్లొమో చేసిన వారి సర్టిఫికెట్లను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి, వొకేషనల్ శిక్షణ పొందిన వారి సర్టిఫికెట్లను ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించి తనిఖీ చేయించనున్నారు. రాష్ట్రంలో ఓ చోట నకిలీ సర్టిఫికెట్ లభించడంతో ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలనకు సర్టిఫికెట్ల స్కానింగ్ జరుగుతోందనీ, విజయనగరం జిల్లా మాత్రమే పెండింగ్ ఉండటంతో వాటిని ఇప్పుడు పరిశీలన చేస్తున్నామని పశుసంవర్ధక శాఖాధికారులు చెబుతున్నారు. బొబ్బిలి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి శ్రీకాకుళం జేడీగా నియమించడంతో అక్కడికి వెళ్లిపోయారు. అతని స్థానంలో ఏడీ డాక్టర్ విష్ణుకు ఎఫ్ఏసీ అప్పగించారు. డాక్టర్ విష్ణు కార్యాలయ పని నిమిత్తం బయటకు వెళ్లడంతో తెర్లాం ఏడీ బి.శ్రీనివాసరావు, బొబ్బిలి డీడీ ఆఫీసు సూపరింటెండెంట్ ఎస్.ధర్మాన పడాల్ సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. వీరిని వివరణ కోరగా గతంలో ఓ ఉద్యోగి సర్టిఫికేట్లు నకిలీవని తేలడంతో అతనిని తొలగించి, జీతం, ఇతర అలెవెన్సులు, శిక్షణ భృతి, ఖర్చులను రికవరీ చేశారనీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏహెచ్ఏల సర్టిఫికెట్లను స్కాన్చేసి ఆయా విద్యా సంస్థలకు పంపిస్తున్నట్టు వారు చెప్పారు. అయితే పారదర్శకంగా జరిగిన ఉద్యోగాల భర్తీలో ఇన్నేళ్ల తరువాత పరిశీలనేంటని వారు ఆందోళన చెందున్నారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన వెనుక ఏం కారణం ఉందో స్పష్టతనివ్వాలని ఏహెచ్ఏలు కోరుతున్నారు.
దాదాపు ఏడేళ్ల తరువాత ఇప్పుడు పరిశీలనా?
నియామకమై సుమారు ఏడేళ్లు
ధ్రువపత్రాల పరిశీలనంటూ తిప్పుతున్న ప్రభుత్వం
ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగింది. ఎన్నికల ప్రచారంలో సచివాలయంలో అన్ని శాఖలూ మీకు అందుబాటులో ఉండేలా నియామకాలుంటాయని చెప్పిన ప్రకారం ఎన్నికయిన తరువాత సచివాయాల్లో పశుసంవర్ధక శాఖ సిబ్బంది కూడా ఉండాలని ఏహెచ్ఏలను నియమించారు. యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మందిని నియమించారు. వీరికి డిప్లొమో లేదా ఒకేషనల్ డెయిరీ అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించి పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు. సచివాలయాల్లో వీరందరినీ 2019–20 ప్రాంతంలో నియమించారు. అంటే దాదాపు ఏడేళ్లవుతోంది. వీరిని ప్రొబేషనరీ పీరియడ్ అయిన తరువాత శాశ్వత ఉద్యోగులుగా గుర్తించింది ప్రభుత్వం. ఇప్పుడు వీరిని పిలిపించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ తిప్పుతుండటం వారిలో అనుమానాలకు తావిస్తోంది. అంతే కాదు వారి ఉద్యోగభద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది.


