● ఎరువుల పంపిణీలో సర్కారు ‘కృత్రిమ’ వ్యూహం ● జిల్లాలో 2.21 లక్షల ఎకరాల్లో పంటల సాగుపై నీలినీడలు ● అంతర్జాతీయ సాకుతో ఎరువులపై అదనపు బాదుడు
జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైనా చంద్రబాబు సర్కారు నుంచి రైతులకు మొండిచేయే కనిపిస్తోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతులను గాలికి వదిలేసింది. సక్రమంగా సాగునీరు అందే పరిస్థితి లేదు. రేపు పంట పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే నెపంతోనే, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగును నిరుత్సాహపరుస్తోంది. ఒకవైపు డీజిల్ ధరలతో ట్రాక్టర్ అద్దెలు భారమై అన్నదాతలు అల్లాడుతున్నారు.
– బి.వి రమణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు /పార్వతీపురం మన్యం జిల్లా
పార్వతీపురం రూరల్: గడిచిన రేండు ఏళ్లుగా ఆశించిన స్థాయిలో పంటలు కలిసిరాలేదు. అప్పుల ఊబిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన సర్కారు ఈ సారి సరికొత్త వ్యూ హంతో సాగుకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అంశం రైతులను కలవరపెడుతోంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకునేందుకే ప్రభుత్వం ఎరువుల సరఫరాలో జాప్యం చేస్తూ, క్షేత్రస్థాయిలో అవస్థలు సృష్టిస్తోందన్న చర్చ గ్రామీణ ప్రాంతాల్లో సాగుతోంది. మరోవైపు తెలుపు అన్నం ఎవరూ తినడంలేదని, ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆసక్తి చూపడంలేదన్న వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగుపై ఆసక్తి సన్నగిల్లేలా చేస్తున్నాయి.
సాగు అంచనాలు తలకిందులు
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.21 లక్షల ఎకరాలు కాగా, వాతావరణ అనుకూలతను బట్టి ఇది 2.41 లక్షల ఎకరాల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ప్రధాన పంట అయిన వరి ఏకంగా 2,16,655 ఎకరాల్లో (97,500 హెక్టార్లు) సాగువుతుందని అంచనా. మొక్కజొన్న 10,791 హెక్టార్లు, పత్తి 2,200 హెక్టార్లు, వివిధ రకాల కూరగాయల సాగు 2,200 ఎకరాల్లో అవుతోంది. పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట, మక్కువ, జియ్యమ్మవలస, సీతానగరం మండలాల్లో దాదాపు 20 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ విస్తరించి ఉంది. పెరిగిన పెట్టుబడులు, ఎల్నినో ప్రభావం, డీజిల్ ధరలు, ప్రభుత్వ చర్యలు సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


