● ఉద్యోగ భద్రత కల్పించాలి
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ
పార్వతీపురం రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ రంగాల్లోని పరిశ్రమలు, సంస్థల్లో పని చేస్తున్న 50 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనంలో ‘కనీస వేతనాల సాధన’ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా నిత్యావసరాలు, విద్యా, వైద్య ఖర్చులు పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి వేతనాలు సవరించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. తక్షణమే కనీస వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జూలై నెలంతా కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి.. జూలై 30, 31 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపడతామని తెలిపారు. సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యదర్శి వై.మన్మధరావు, ఉపాధ్యక్షులు వి.ఇందిర, జి.జ్యోతి, ఎం.శివాని, వై.శాంతి కుమారి, ఇతర కార్యదర్శులు బి.వి.రమణ, ఎన్.వై.నాయుడు, ఆర్.రాము, కోశాధికారి గొర్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


