రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్ సాగుకు సిద్ధమైన కర్షకులను టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు మరింత కలవర పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే ఉచిత పంటల బీమా, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవకు మంగళం పాడిన ప్రభుత్వం ఇప్పడు రైతులకు ఏటా ఆర్బీకేల వారీగా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమాలను నామమత్రం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వివిధ రకాల ఎరువుల ధరలను పెంచి ప్రభుత్వం షాక్ మీద షాక్లు ఇచ్చింది. ఇప్పుడేమో పొలంబడులు పరిమితం చేసి రైతులకు వ్యవసాయం సేద్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు లేవని తెలియడంతో మరింత షాక్ తగిలినట్లయింది.
జిల్లాలో 13మండలాల్లో మాత్రమే
పొలంబడి..
జిల్లాలోని 14 మండలాల్లో పొలంబడి కార్యక్రమాల నిర్వహణకు మంగళం పాడినట్లు తెలిసింది. వ్యవసాయ డివిజన్కు రెండు , చొప్పున మండలానికి ఒక్కొక్కటి చప్పున 13 మండలాలను పొలంబడి నిర్వహణకు ఎంపికచేశారు.అందులో బొబ్బిలి డివిజన్లో రామభద్రపురం, తెర్లాం చీపురుపల్లి డివిజన్లో చీపురుపల్లి ,మెరకముడిదాం, గజపతినగరం డివిజన్లో గజపతినగరం, మెంటాడ, విజయనగరం డివిజన్లో డెంకాడ, గంట్యాడ, కొత్తవలస డివిజన్లో నాలుగు పొలంబడి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇందులో కొత్తవలస,ఎల్కోట, ఎస్కోట, వేపాడ మండలాలు ఉన్నాయి. అలాగే రాజాం డివిజన్లో రేగిడి అమదాలవలస మండలంలో మాత్రమే ఒకటి నిర్వహించనున్నారు. అయితే జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయల పంటలు సాగు చేయనున్నారు.ఈ పంటలకు రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగం, పంటల దిగుబడి, ఏ పొంలంలో ఏఏ పంటలు సాగుచేయాలి, ఆయా పంటల సస్యరక్షణ చర్యలపై విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నిర్వహించే పొలంబడి కార్యక్రమాలను అంతంతమాత్రమే చేయడం పంటలు సేద్యం చేసే అన్నదాతను చంద్రబాబు ప్రభుత్వం మరింత ఆందోళనకు గరిచేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
పంటల సాగు పడిపోయే ప్రమాదం
ఇప్పటికే వరుస పంటనష్టాలు, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం లేకపోలేదని అన్నదాతలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గడిచిన రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, రైతులకు కాలం కలిసి రాక పంటల పెట్టుబడులు దక్కకపోవడం, ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేకపోవడంమేనని రైతులు విమర్శిస్తున్నారు.ఈ ఏడాది ఎల్నినో ప్రమాదం పొంచి ఉండడం రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వర్షాలు పడతాయో లేదోనని, పడినా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి.ఈ నేపథ్యంలో తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు,పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకోవాలనే సూచనలు సలహాలకు పొలంబండులు కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాలను నామమాత్రం చేసి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడుతున్నారు.అలాగే గతేడాది ఖరీఫ్లో ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాతలు గంటల తరబడి క్యూలో ఉండి నానా అవస్థలు పడ్డారు.చాలా చోట్ల రైతులకు అందాల్సిన యూరియా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తరలించుకుపోయారు.ఈ ఏడాది ఎరువుల ధరలు అధికంగా పెరగడంతో పాటు ఎరువులు యాప్ ద్వారా పంపిణీ అంటూ పరిమితులు అమలు చేయడం వల్ల ఖరీఫ్ పంటలు సాగు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది.
14 మండలాల్లో కార్యక్రమం నిర్వహణకు మంగళం
కూటమి నిర్ణయంతో కర్షకుడిలో
కలవరం
రైతులకు ఏటా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాన్ని పక్కన పెట్టిన
ప్రభుత్వం
పంటల సాగు పడిపోయే ప్రమాదం
వైఎస్ఆర్సీపీ హయాంలో ఇలా..
వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు, పంటల సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించి నాణ్యమైన పంటలను పండించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు ఏటా ప్రతి ఆర్బీకే వారీగా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమాలను నిర్వహించింది.ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు పండించే పొలంలోకి నేరుగా వెళ్లి అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పంటల సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించేవారు. రైతులు పండించిన పంటలు అధిక దిగుబడులు సాధించేలా సూచనలు సలహాలు ఇచ్చేవారు, దీంతో రైతులు తాము పండించిన పంటలు మార్కెట్ ధరకంటే అధిక ధరకు అమ్ముకుని లబ్ధిపొందేవారు.
పొలంబడి తగ్గింపుతో రైతులకు ఇబ్బందిలేదు
పొలంబడులు తగ్గించినా రైతులకు వ్యవసాయ సాగులో ఏ ఇబ్బంది ఉండదు. గ్రా మ, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు ఏడీఏ,డీడీలు కూడా నిత్యం రైతులకు పంటల సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు.పొలంబడులతో సంబంధం లేకుండా రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచేందుకు చ ర్యలు తీసుకుంటాం.వీటీ రామారావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, విజయనగరం


