సీతానగరం: మత్తు పదార్థాలు వినియోగించడంతో వచ్చే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్సై హేమలత అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై హేమలత మాట్లాడుతూ మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులు అవగాహన కల్పించుకుని గ్రామాల్లో విరామసమయంలో ప్రజలకు వివరించాలని కోరారు. సమాజాన్ని మత్తునుంచి కాపాడే బాధ్యత విద్యార్థులపై ఉందని అందుకు అనుగుణంగా చైతన్యవంతులు కావాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎస్సై లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


