విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన 6 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,901 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,867 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన జాయింట్ కలెక్టర్ (నోడల్ అధికారి) సేతుమాధవన్ పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్, విద్యా శాఖ సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసినట్లు అధికారులు తెలిపారు. పటిష్ట పోలీసు భద్రత నడుమ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. నగరంలో ఏపీ మోడల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల, కస్పా హైస్కూల్, కేంద్రీయ విద్యాలయం, జేఎన్టీయూ కేంద్రాల్లో జరిగిన పరీక్షలను ఎస్పీ సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.


