వీరఘట్టం: మండలంలోని చిదిమి రోడ్డులో ఉన్న ప్రైవేట్ భూములను ఏడాదికి ఒక ఎకరా భూమిని రూ.35 వేల నుంచి రూ.40 వేలుకు కొందరు కౌలుదారులు లీజుకు తీసుకుని కాయగూరల వ్యవసాయం చేస్తున్నారు. ఇదే రోడ్డులో కొంత దూరంలో ఉన్న వీరఘట్టం శ్రీ జగన్నాథస్వామి ఆలయ భూములు సుమారు 24.5 ఎకరాలు ఉన్నాయి. వాటిి ని అధికారులు ఎకరా భూమికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు లీజుకు ఇచ్చారు. ఈ గుడికి వీరఘట్టం, పాలకొండ, వంగర మండలాల్లో సుమారు 49 ఎకరాలకు పైబడి భూములున్నాయి. ఈ భూములన్నింటికీ వాస్తవంగా అయితే లీజులు ఏడాదికి రూ.15 లక్షల వరకు రావాలి.అయితే ఈ లీజులు కనీసం రూ.5 లక్షలు కూడా రావడం లేదు. ఈ ఆలయ భూములపై వస్తున్న అరకొర రాబడి కూడా సక్రమంగా దేవుడికి చేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దేవుడి ఆస్తులనే ఆక్రమణ చేస్తుంటే పాపం ఏమీ చేయలేని దుస్థితిలో దేవుడు చిక్కుకున్నాడు. తనకు ప్రతినిధులుగా ఉన్న దేవాదాయశాఖ అధికారులు కళ్లకు గంతలు కట్టి ఆక్రమణదారులకు అండగా నిలుస్తుంటే ఇక చెప్పుకోలేక తిప్పలు పడే స్థితి దేవుడికి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏళ్ల తరబడి తనభూములకు సక్రమంగా కౌలు రాక, తాను నిత్యం ధూపదీప నైవేద్యాలకు నోచుకోక దేవుడు బిక్కమొహం వేస్తున్నాడు. వీరఘట్టం జగన్నాథ స్వామి ఆలయానికి ఉన్న సుమారు 49 ఎకరాల దేవదాయ భూములు కొన్ని ఆక్రమణల్లో ఉండగా, మిగిలిన వాటికి నామమాత్రపు లీజులు చెల్లిస్తున్నారు.ఫలితంగా ఆస్తులు ఉన్నా ఆదాయం లేక జగన్నాథుని ఆలయాల నిర్వహణ దయనీయంగా మారింది.
ఇదీ దేవుడి దుస్థితి
వీరఘట్టం జగన్నాథుని స్తిరాస్తులు 49 ఎకరాలు
ఆ భూములు ఎక్కడ ఉన్నయో తెలియని పరిస్థితి
నామమాత్రపు లీజులతో అరకొర ఆదాయం
ఇటీవల గుట్టుగా జరిగిన లీజు
ఒప్పందాలు
కేవలం 38.75 ఎకరాలకు మాత్రమే లీజు ఒప్పందం
మిగిలిన 10.25 ఎకరాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి
ఇదీ వీరఘట్టంలో ఉన్న జగన్నాథస్వామి ఆలయ భూముల పరిస్థితి


