రేగిడి:
మండల పరిధిలోని మజ్జిరాముడుపేట గ్రామసమీపంలోని పంటపొలాల్లో ఉన్న బావిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. . ఆదివారం అటుగా వరి విత్తనాలు పోసేందుకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని చూసి వీఆర్వో దుర్గారావుకు సమాచారం అందించారు. దీంతో వీఆర్వో ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఈ మేరకు ఎస్సై వి.బాలకృష్ణ, ఏఎస్సై గౌరినాయుడులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ నెల 17న తప్పిపోయిన అక్కన్న అగ్రహారం గ్రామానికి చెందిన అల్లెన అశోక్ (22)గా గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి మృతదేహం తమ కుమారుడిదేనంటూ భోరున విలపించారు. ఈ నెల 16న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఈ నెల 17న ఫిర్యాదు చేశామని మృతుడి గవరయ్య విలేకరులకు తెలిపారు.
శోకసంద్రంలో కుటుంబం
అల్లెన అశోక్ డిగ్రీ చదువుకున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి సహాయపడుతుండేవాడని తల్లిదండ్రులు గవరయ్య చిన్నమ్మలు భోరున విలపిస్తున్నారు. మృతుడికి తమ్ముడు ఉన్నాడు. మృతదేహం ఉబ్బిపోవడంతో సంఘటనా స్థలం వద్ద వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బాలకృష్ణ తెలిపారు.


