పార్వతీపురం రూరల్ : వయోభారంతో వచ్చే కీళ్ల నొప్పులు, మధుమేహం, బీపీ, శ్వాసకోశ, మానసిక ఒత్తిడి తదితర సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ప్రాణాయామం ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వృద్ధులకు ప్రత్యేకంగా ‘థీమాటిక్ యోగా’ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వారితో కలిసి ఆసనాలు వేశారు. సీనియర్ సిటిజన్లు సులభంగా వేయగలిగే ఆసనాలపై ఈ సందర్భంగా నిపుణులతో అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో ఆసనాలను భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆదివారం ఉదయం ఇదే మైదానంలో జరిగే ప్రధాన యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీవో కె.మాధురి, మున్సిపల్ కమిషనర్ పావని, ఆయుష్, వైద్య శాఖల అధికారులు డా.జగన్మోహనరావు, డా.భాస్కరరావు, డా.నాగభూషణరావు, యోగా శిక్షకులు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.


